అల్వాల్, మే 23: కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఈనెలఖారు లేదా వచ్చేనెల మొదటి వారంలో పింఛన్లు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేశారు. సోమవారం అల్వాల్ డివిజన్లోని హరిజన బస్తీలో స్థానిక కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు సమస్యలు తెలుసుకున్నారు. పలువురు తమకు ఇండ్లు కట్టుకోవడానికి సాయం చేయాలని కోరగా..ఎమ్మెల్యే మైనంపల్లి మాట్లాడుతూ.. సొంత స్థలం ఉన్నవాళ్లకు ప్రభుత్వం రూ.3 లక్షల ఇస్తోందని, అందుకు సంబంధించి బడ్జెట్ ఇప్పటికే విడుదల చేసినట్లు చెప్పారు. ఇక స్థలం లేని పేదవాళ్లు దరఖాస్తు చేసుకుంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. 4,500 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే వాటిని కూడా కేటాయిస్తామన్నారు. కార్యక్రమంలో మచ్చబొల్లారం, వెంకటాపురం డివిజన్ల కార్పొరేటర్లు జితేంద్రనాథ్, సబితాకిశోర్, మున్సిపల్ డీసీ నాగమణి, సీఐ గంగాధర్, తహసీల్దార్, ఈఈ, ఏఈఈ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
డ్రైనేజీ, రోడ్ల ఏర్పాటుకు హామీ
ప్రజాదర్బార్కు వచ్చిన కొంతమంది స్థానికులు రోడ్లు, డ్రైనేజీ సమస్యలపై ఎమ్మెల్యేకు విన్నవించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ.. ఇప్పటికే చాలా కాలనీల్లో డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, అక్కడ రోడ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇక డ్రైనేజీ పనులు పూర్తికాని ప్రాంతాల్లో వెంటనే పూర్తిచేసి తర్వాత రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వెంకటసాయి నగర్ డ్రైనేజీలు పొంగి ఇండ్లల్లోకి వస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేయగా.. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడు డ్రైనేజీ పనుల కోసం రూ.42 లక్షల మంజూరు చేయించారు. ఇక చాకలి బస్తీలో నీటి సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తేగా నల్లాలు ఏరాటు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
రెండు,మూడు రోజుల్లో నీళ్లు వస్తాయిని, వాటిని వృథా చేయకుండా వాడుకోవాలని ఆయ న చాకలిబస్తీ వాసులకు సూచించారు. ఇక హరిజన బస్తీలో ఆధార్తో అనుసంధానం చేసుకున్నా వాటర్ బిల్లు అడ్డగోలుగా వస్తోందని స్థానికులు ఆయనకు చెప్పగా.. నీళ్లు పూర్తి ఫ్రీగా వస్తాయన్నారు. అలా కాకుండా బిల్లు వస్తున్నవారి సమస్యను పరిష్కరించేందుకు రేపు బస్తీలో క్యాంపు ఏర్పాటు చేసి సమస్యలు తీర్చాలని ఆయని సంబంధిత అధికారులను ఆదేశించారు. డివిజన్లో దోమల బెడద ఎక్కువగా తీవ్రంగా ఉందని స్థానికులు మొరపెట్టుకోగా.. చెరువుల్లో మురుగునీరు కలువకుండా చర్యలు చేపట్టామని, త్వరలోనే సమస్య పరిష్కారమైన దోమల బెడద తప్పుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
మహిళా సంఘాలకు విస్తరాకుల మిషన్లు
హరిజన బస్తీలోని మహిళా సంఘం మహిళలు తమ కు ఉపాధి చూపాలని ఎమ్మెల్యేను కోరారు. అందుకు ఆయన ఏం సహాయం కావాలని అడగ్గా.. విస్తరాకుల మిషన్లు ఇస్తే వందలమంది మహిళలకు ఉపాధి లభిస్తుందని చెప్పడంతో ఆయన 4 విస్తరాకుల మిషన్లు ఇచ్చేందుకు అంగీకరించారు. వాటితో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
హరిజన బస్తీలో జిమ్
ప్రజాదర్బార సందర్భంగా హరిజన బస్తీకి చెందిన కొందరు యువకులు తమకు ఓపెన్ జిమ్ కావాలని ఎమ్మెల్యేను కోరారు. దానికి ఆయన సమాధానం ఇస్తూ.. స్థలం ఉంటే తన సొంత నిధులు రూ.5 లక్షలు మంజూ రు చేస్తానని, యువకులు తమకు కావాల్సిన జిమ్ పరికరాలు తెప్పించి ఏర్పాటు చేసుకోవాలని సూచించడంతో యువకులు హర్షం వ్యక్తం చేశారు.