ఆర్కేపురం, మే 23 : జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలోని ఐదు సర్కిల్లోని అన్ని ప్రాంతాల్లో రాబోయే వర్షాకాల నేపథ్యంలో తక్షణ జాగ్రత్తలు చేపట్టాలని ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ సూచించారు. సోమవారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో ఐదు సర్కిళ్ల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రధానంగా వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వరద ముంపు నివారణ కోసం నిర్మిస్తున్న వరద నీటి కాలువల నిర్మాణలను యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేసే విధంగా చూడాలని తెలిపారు.
ఎల్బీనగర్ జోన్లోని కాప్రా, ఉప్పల్, హయత్నగర్, ఎల్బీనగర్, సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని అన్ని నాలాలు డ్రైనేజీల్లో పూడికతీత పనులు పకడ్బందీగా చేపట్టి మురుగునీరు వరద నీరు సాఫిగా వెళ్లేలా చేయాలని ఆదేశించారు. ఎల్బీనగర్ జోన్ వ్యాప్తంగా నిర్మిస్తున్న థీమ్ పార్కుల పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జోన్ వ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో సౌకర్యాలపైన, కమ్యూనిటీ హాల్ నిర్మాణంపైన అత్యాధునిక టాయిలెట్ల నిర్మాణాలపైన సంబంధింత అధికారులతో జోనల్ కమిషన్ పంకజ చర్చించి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ జోన్ ఎస్సీ అశోక్రెడ్డితో పాటు అన్ని సర్కిళ్ల ఉప కమిషనర్లు, ఇంజినీరింగ్ విభాగం ఎగ్గిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.