శంషాబాద్ రూరల్, మే 23 : శంషాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ పట్టణంలో అభివృద్ధి పనులు చేయడం లేదని వైస్ చైర్మన్ బండిగోపాల్, పలువురు కౌన్సిలర్లు మండిపడ్డారు. నిధులు మంజూరైన ఆయా వార్డుల్లో పనులు చేయడంలేదని కౌన్సిలర్లు అజయ్, కుమార్, భద్రునాయక్, విజయలక్ష్మి, సునీత, నజీయబేగం ఆరోపించారు. సోమవారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వార్డుల్లో చిన్నచిన్న ప నులు కూడా చేయలేకపోతున్నట్లు తెలిపారు. సమస్యలు వారి దృష్టికి తీసుకుపోతే స్పందించడం లేదన్నారు.
మున్సిపల్ కార్యాలయానికి సంబంధించి వాహనాల కొనుగోలు విషయంలో కమిషనర్ పెద్ద ఎత్తున అవినీతి చేశారని వాటి వివరాలు అడిగితే చెప్పడంలేదన్నారు. కమిషనర్ తనకు ఇష్టం వచ్చినప్పుడు కార్యాలయానికి వస్తాడని ఆరోపించారు. 14వ వార్డులో ఓ వ్యక్తి చనిపోయి 6 నెలలు గడుస్తున్న అతడి పేరున ప్రతి నెల ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంత్రి కేటీఆర్ మున్సిపాలిటీలకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ సైతం అభివృద్ధి పనులు చేయాలని పలుమార్లు చైర్ పర్సన్ సుష్మ, కమిషనర్ సాబేర్ అలీకి ఆదేశాలు జారీ చేసిన వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.