సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): నగర, పట్టణ ప్రగతిలో చేపట్టే కార్యక్రమాలు మెరుగైన నగర/పట్టణ జీవనానికి బలమైన పునాదులు కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వచ్చేనెల 3 నుంచి 15రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు పట్టణ ప్రగతిని సమర్థవంతంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ వార్డుల వారీగా ప్రణాళికలతో సిద్ధమైంది. ఇప్పటికే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ లోకేశ్ కుమార్ సమీక్షా సమావేశాలు నిర్వహించి జోనల్ కమిషనర్లకు పట్టణ ప్రగతి విజయవంతం చేసే దిశగా ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు. మోడల్ మార్కెట్లు, పార్కులు, డంప్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్లు, స్ట్రీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశానవాటికలు, అర్బన్ లంగ్ స్పేస్, ఓపెన్ జిమ్స్ వంటి సౌకర్యాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.
రోడ్ల పక్కన చెత్త, పిచ్చి మొక్కలు, మట్టి దిబ్బల తొలగింపు, మురుగునీటి కాలువలు శుభ్రం చేయడం, ఖాళీ స్థలాల్లో చెత్త తొలగింపు , పబ్లిక్ స్థలాల శుభ్రం, పాడుబడిన భవనాల తొలగింపు, పాడైన బోర్లు, బావుల పూడ్చివేత, ప్రజా మరుగుదొడ్ల నిర్మాణానికి స్థలాలను గుర్తించి తగిన చర్యలు చేపడతారు. శ్మశానవాటికలకు, సమీకృత మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించడం, పార్కులు, ఆట స్థలాల అభివృద్ధికి ప్రణాళిక, పచ్చదనం కోసం ఖాళీ స్థలాల గుర్తింపు, అవెన్యూ ప్లాంటేషన్, నాటిన మొక్కలను 85 శాతం బతికించేలా, డంపింగ్ యార్డులు, మానవ వ్యర్థాల శుద్ధి కేంద్రాలకు స్థలాల కేటాయింపు, పట్టణంలో వీధి వ్యాపారులకు జోన్ల ఏర్పాటుపై చర్యలు తీసుకోనున్నారు. 15 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పౌరులను భాగస్వామ్యం చేయనున్నారు. మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు వారి ప్రాంతాల్లో నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో విధిగా పాల్గొని లక్ష్యాలను సాధించేలా జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టనున్నది.
వార్డుల వారీగా లక్ష్యాలు..
దోమల నివారణకు తగిన చర్యలు తీసుకోవడం, పచ్చదనం పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టడం, నాటిన మొక్కల్లో 85 శాతానికి పైగా జీవించేలా జాగ్రత్తలు తీసుకోవడం, లోతట్టు ప్రాంతాలు ముంపు బారిన పడకుండా ఉండేలా చూడటం తదితర అంశాలు పట్టణ ప్రగతిలో చేపట్టాల్సిన కార్యక్రమాల్లో ఉన్నాయి. వీటిని అమలు చేసేందుకు జోనల్, సర్కిళ్ల వారీగా పట్టణ ప్రగతి పనులతో రూపొందించిన దృశ్యాల ఫొటోలతో కూడిన బుక్లెట్లను సిద్ధం చేయనున్నారు.
నగరంలో ఎక్కడా చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచడం, రోడ్ల వెంబడి పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు, నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు లేకుండా చేయడం, నాలాల్లో పూడిక లేకుండా వరద నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోనున్నారు.
ఓపెన్ ప్లాట్లలో చెత్తా చెదారం లేకుండా చేయడం, వాటిని యాజమానులు తొలగించకుంటే జీహెచ్ఎం సీ తొలగించి యజమానుల నుంచి చార్జీలు వసూలు చేయడం, పార్కుల్లో వ్యర్థాలు లేకుండా చూడటం, విద్యాసంస్థలతో పాటు ప్రజలు ఎక్కువగా ఉండే కా ర్యాలయాలు, దవాఖానలు, బస్టాపులు, రైల్వే స్టేషన్లు తదితర ప్రాంతాల్లో పారిశుధ్యం మెరుగుపర్చడం, పబ్లిక్ టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేలా చూడటం, శ్మశాన వాటికల్ని పరిశుభ్రంగా ఉంచడం, శిథిలమైన భవనాల్ని గుర్తించి అవసరమైన చర్యలు చేపడతారు.
పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టే పనులకు సంబంధించిన వివరాలను ఏ రోజుకు ఆ రోజు నివేదికలో పొందుపర్చాల్సి ఉంటుంది.
భారీ జరిమానాలు..
బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తొలగించిన తర్వాత తిరిగి చెత్తను వేయడంతో సమస్య మొదటికొస్తున్నది. నాలాల్లో వ్యర్థాలు వేస్తున్నందున నీరు సాఫీగా వెళ్లకుండా ముంపు సమస్యలు పెరుగుతున్నాయి. దీంతో చెత్తా, వ్యర్థాలు వేసే వారికి భారీ జరిమానాలు విధించేందుకు సైతం సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా కొన్ని ప్రాంతాల్లో హెచ్చరికలతో బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.