సిటీబ్యూరో, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం జాతీయ స్థాయిలో మూడవ స్థానాన్ని దక్కించుకుంది. మొదటి స్థానానికి చేరుకునేందుకు మరింత కష్టపడుతాం. అందుకోసం వైద్యసిబ్బంది కృషిచేయాలి. గాంధీ దవాఖాన అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ రూ.100కోట్లు కేటాయించారు. అందులో ఈరోజు రూ.25 కోట్లతో పలు అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఆదివారం గాంధీ దవాఖానలో పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్తో కలిసి మంత్రి హరీశ్రావు క్యాథ్ ల్యాబ్, ఎంఆర్ఐ, ఆధునిక వంటశాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆయన దవాఖానలోని వార్డులన్నీ కలియతిరిగారు. ఐసీయూ, ఆర్థో విభాగాల్లో పలువురు రోగులను పలుకరించారు. దవాఖానలో అందుతున్న వైద్యసేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. రూ.13 కోట్లతో అత్యాధునికమైన ఎంఆర్ఐని, రూ.9కోట్లతో క్యాథ్ ల్యాబ్, రూ.2.70కోట్లతో అధునాతన వంటశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు మంత్రి హరీశ్రావు తెలిపారు. దవాఖానలో డ్రైనేజీ, వాటర్లైన్, ఫైర్ సేఫ్టీ సమస్యలున్నట్లు వైద్యాధికారులు తమ దృష్టికి తీసుకువచ్చారని, వాటిని మెరుగుపర్చేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రూ.55కోట్లతో ఎంసీహెచ్ నిర్మాణ పనులు, రూ.2కోట్లతో 100పడకల ఐసీయూ పనులు, దాదాపు రూ.కోటి వ్యయంతో పేషెంట్ షెల్టర్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.
మూడుపూటల భోజనానికి రూ.30కోట్లు
నగరంలోని 18దవాఖానల్లో రోగి సహాయకులకు మూడు పూటలా అన్నపూర్ణ భోజనం అందిస్తున్నామని, ఇందుకు ఏడాదికి రూ.30కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.
ఇక గాంధీలో క్యాథ్ ల్యాబ్ సేవలు
ఇప్పటికే ఉస్మానియాలో క్యాథ్ ల్యాబ్ ద్వారా 250మందికి ఎంజియోప్లాస్టీ, ఆంజియోగ్రామ్ వంటి చికిత్సలు అందుతున్నాయని, ఇక నుంచి గాంధీలో కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు మంత్రి తెలిపారు.
బస్తీ దవాఖానలతో ఓపీ తగ్గింది
గ్రేటర్లో 259 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చామని, త్వరలో మరో 91బస్తీ దవాఖానలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. బస్తీ దవాఖానల ఏర్పాటుతో ఫీవర్ దవాఖానలో ఓపీ 4000 నుంచి 400కు పడిపోయిందని, అలాగే గాంధీలో కూడా ఓపీ తగ్గిందని చెప్పారు. మంత్రి తలసాని విజ్ఞప్తి మేరకు 23డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో 23బస్తీ దవాఖానలను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
273మంది సిబ్బందిని నియమిస్తాం
గాంధీలో 391మంది సెక్యూరిటీ, పేషెంట్కేర్, శానిటేషన్ సిబ్బంది ఉన్నారని, మరో 273మందిని నియమించనున్నట్లు తెలిపారు. శానిటేషన్, పేషెంట్కేర్, సెక్యూరిటీ కోసం రూ.340 కోట్లు ఖర్చుపెడుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ ఆదర్శంగా తమిళనాడులో..
సింగిల్ యూజ్డ్ డయాలసిస్ సెంటర్లను మన వద్దనే తొలిసారిగా ప్రారంభించామని, మనల్ని చూసి తమిళనాడు సీఎం స్టాలిన్ అక్కడ కూడా సింగిల్ యూజ్డ్ డయాలసిస్ సెంటర్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారని మంత్రి చెప్పారు.