సిటీబ్యూరో, మే 22(నమస్తే తెలంగాణ): ఫేస్బుక్లో ఓ యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది…వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు..తుర్కయాంజాల్ టు యూకే మధ్య సంభాషణలు సాగాయి..ఓ రోజు ఫ్రెండ్షిప్లో బిజినెస్ ఆఫర్ ఇచ్చిందామె.. వ్యాపారంలో భాగస్వామ్యాన్ని ఇచ్చింది.. అడ్వాన్స్ పేరు చెప్పి.. లక్షలు అకౌంట్లో పడగానే.. ఆమె మాటలు బంద్ అయ్యాయి. ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. ఆలస్యంగా తెరుకున్న బాధితుడు లబోదిబోమంటూ..సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి మోసపోయిన తీరిది.
బిజినెస్ చేస్తున్నానని..
నగరానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి ఫేస్బుక్ ఖాతాకు యూకేకు చెందిన యువతి నుంచి ఫ్రెండ్ రిక్వెస్టు వచ్చింది. దీనికి స్పందించడంతో ఇద్దరు వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నారు. ఆ యువతి ఇండియాలో బ్లడ్ క్యాన్సర్ నివారణకు అక్వాల యాక్టివ్ లిక్విడ్ మెడిసిన్ దొరుకుతుందని, తాను ఆ మందు సరఫరాకు సంబంధించిన బిజినెస్ చేస్తున్నానని వివరించింది.‘ఈ మందుకు అమెరికా, యూకేల్లో చాలా డిమాండ్ ఉంది. నీకు ఆసక్తి ఉంటే నా వ్యాపారంలో నీకు భాగస్వామ్యం ఇస్తాను. పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయి’ అని చెప్పింది. ‘ఈ మెడిసిన్ లీటరు ధర 4.50 లక్షలు ఉంటుంది. ఇది తీసుకుని మాకు ఎగుమతి చేస్తే లీటరుకు 50 వేల రూపాయల కమీషన్ ఇస్తాం’ అని నమ్మించింది. అత్యవసరంగా తనకు 500 లీటర్ల మెడిసిన్ అవసరం ఉందని చెప్పింది. ఈ మెడిసిన్ సరఫరా చేసే శర్మ ఎంటర్ప్రైజస్ను సంప్రదించి తన పేరు చెప్పితే ఇస్తారని తెలిపింది.
అయితే ముందుగా లీటరు మెడిసిన్ కొనుగోలు చేసి దానిని ఢిల్లీకి తీసుకువస్తే.. పరీక్షించి 500 లీటర్ల ఆర్డర్ను ఒకే చేస్తామని నమ్మబలికింది. బాధితుడు సదరు ఎంటర్ప్రైజెస్ను సంప్రదించి.. ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చి మందును ఇంటికి తెప్పించుకున్నాడు. ఆ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లి.. అక్కడి ఇద్దరికి చూపించాడు. ఇందుకోసం రూ. 2.05 లక్షలు ఖర్చుపెట్టాడు. ఆ తర్వాత అతడికి ఆర్డర్ ఒకే అయ్యింది.. ‘500 లీటర్లు సరఫరా చేయండి..మీకు కమీషన్ కింద రూ. 25 లక్షలు వస్తాయి’ అని ఆ యువతి స్పష్టం చేసింది. దీంతో బాధితుడు దాదాపు రూ. 33 లక్షలు చెల్లించి.. మెడిసిన్కు ఆర్డర్ ఇచ్చాడు. 11 లావాదేవిల్లో ఈ నగదునంతా ఆన్లైన్లో బదిలీ చేశాడు. అకౌంట్లో డబ్బులు పడగానే ఆ యువతి వాట్సాప్ కాల్స్, చాటింగ్ బంద్ పెట్టింది. శర్మ ఎంటర్ప్రైజెస్ ఫోన్లు సైతం పనిచేయలేదు. షాక్ తిన్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, దర్యాప్తు చేస్తున్నారు.