మణికొండ, మే 22 : తమ చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడన్న నెపంతో నడిరోడ్డుపై ఓ యువకుడిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచేశారు అన్నదమ్ములు. ఈ ఘటన ఆదివారం నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం….నార్సింగిలో నివాసముంటున్న సయ్యద్ నసీర్(24) క్యాబ్ డ్రైవర్. అదే గ్రామానికి చెందిన మహ్మద్ నవీద్ అలియాస్ చోటు, మహ్మద్ అక్బర్ అలియాస్ బన్నిల సోదరిని నసీర్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నాడన్న కారణంతో అతడిని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్న అన్నదమ్ముళ్లు.. ఆదివారం అల్కాపూర్ టౌన్షిప్ రోడ్డు నంబర్ .1లో ఓ పాన్షాప్ వద్ద నిల్చొని ఉండగా, కత్తులతో పొడిచి.. లంగర్హౌస్ పోలీస్స్టేషన్లో లొంగిపోయారు. స్థానికులు నసీర్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమిస్తుండటంతో ఉస్మానియాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని నసీర్ను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు బాధితుడి తండ్రి నజీర్ ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నవీద్, అక్బర్లను అరెస్టు చేశారు.