ఘట్కేసర్ రూరల్, మే 22: మంత్ర విద్యలతో భూతాలను తరిమికొట్టి.. నాలుగు కోట్ల విలువైన గుప్త నిధులను వెలికి తీస్తామని నమ్మించి లక్షలు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ఘట్కేసర్ పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ ఎన్. చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం..ఎదులాబాద్కు చెందిన మాచర్ల రాజు స్థానికంగా పంచర్ దుకాణాన్ని నడుపుతున్నాడు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా గన్నేరువనంకు చెందిన మటం చందు(30), రాజన్న సిరిసిల్లా జిల్లా తంగలపల్లికి చెందిన ఎర్నాల సంజీవ్(22) ఇటీవల మాచెర్ల రాజు దుకాణానికి వచ్చి..మేం సాధువులం అని చెప్పుకున్నారు. ఇద్దరిని ఇంటికి తీసుకెళ్లి..మర్యాదలు చేసిన రాజు.. వారికి రూ. 3వేలు ఫోన్పే ద్వారా చెల్లించాడు. అతడి ఇంట్లో పూజ గదికి తాళం ఉండటంతో ఆరా తీశారు.
తన సోదరుడి కుమారుడు మృతి చెందిన కారణంగా తాళం పెట్టినట్లు రాజు చెప్పాడు. అయితే అందులో భూతాలు ఉన్నాయని, పూజలు చేయకపోతే..వచ్చే అమావాస్య లోపు మరొకరు చనిపోతారని భయపెట్టి.. పూజలు చేసి.. రూ. 35 వేలు తీసుకొని వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లి వచ్చి.. మీ ఇంట్లో నాలుగు కోట్ల విలువైన గుప్త నిధులు ఉన్నాయని, పూజ గదిలో ఉన్న భూతాలను తరిమికొట్టి వాటిని తీయాల్సి ఉంటుందని నమ్మించారు. కరీంనగర్కు తీసుకువెళ్లి రూ. 1.80 లక్షలతో పూజ సామగ్రిని కొనుగోలు చేయించారు. రాజుకు తెలియకుండా నిందితులు ఆ దుకాణం యజమాని నుంచి రూ.1.30 లక్షలు తిరిగి తీసుకున్నారు. విడతల వారీగా రాజు నుంచి మొత్తం సుమారు రూ. 7.7 లక్షలు కాజేశారు. ఈ నెల 20న మళ్లి వచ్చి డబ్బులు డిమాండ్ చేయడంతో మోసాన్ని గ్రహించిన రాజు ఘట్కేసర్ పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చందు, సంజీవ్ను ఆదివారం రిమాండ్కు తరలించారు.