మియాపూర్, మే 22 : దళితుల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని, నిజమైన బంధువు ఆయనేనని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆర్థిక, సామాజిక అసమానతలను రూపుమాపి స్వశక్తితో ఎదిగేలా పథకాలతో వారికి చేయూతను అందిస్తున్నారన్నారు. వివేకానందనగర్, కూకట్పల్లి డివిజన్లలో దళితబందు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ, నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ గాంధీ మంజూరు పత్రాలను ఆదివారం తన నివాసంలో అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరి కొందరికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలో 100 మంది దళితులకు ఈ పథకం కింద లబ్ధి అందిస్తున్నట్లు పేర్కొన్నారు. సాయంతో మంచి యూనిట్లను నెలకొల్పి స్వయం ఉపాధితో పాటు తోటి వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. దళితుల సంక్షేమానికి పటిష్టమైన చర్యలతో తెలంగాణ దేశంలోనే తగు స్థాయిలో ఉన్నదని విప్ గాంధీ అన్నారు. ఈ పథకాన్ని దశలవారీగా పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు సమ్మారెడ్డి, సంజీవరెడ్డి, పోతుల రాజేందర్, సత్యనారాయణ, మోజెస్, భద్రయ్య, సదా బాలయ్య, దానయ్య, అనీల్, సదా మాధవి పాల్గొన్నారు.
అవయవదానంపై అవగాహన..
ఆల్విన్ కాలనీ డివిజన్ భవ్యాస్ తులసీ వనంలో అవని స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు శిరీష ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన అవయవదానం అవగాహన కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్లతో కలిసి విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవయవదానంపై ప్రజలలో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అవయవ దానం ద్వారా మరికొందరికి పునర్జన్మ ప్రసాదించినట్లవుతుందన్నారు. ప్రజలలో అవగాహనకు కార్యక్రమం చేపట్టిన శిరీషను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జీవన్ దాన్ కమిటీ సభ్యులు డాక్టర్ భాను, తులసీ వనం ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అవయవదానం చేస్తామని వేదికలో పేర్కొన్నారు.
సీఎం సహాయనిధి అందజేత
గచ్చిబౌలి డివిజన్ రాజీవ్నగర్కు చెందిన వెంకట సతీష్కు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా.. రూ.2 లక్షల ఆర్థికసాయం మంజూరు పత్రాలను కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణలతో కలిసి విప్ గాంధీ అందించారు. ఈ కార్యక్రమంలో సంజీవరెడ్డి, రాజేందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.