కేపీహెచ్బీ కాలనీ, మే 22 : కేపీహెచ్బీ కాలనీని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 5వ ఫేజ్లో రూ.4 కోట్లతో చేపట్టనున్న క్రికెట్ స్టేడియం, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలోని మలేషియన్ టౌన్షిప్, లోదా అపార్ట్మెంట్ మధ్యన నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్ని కేబీఆర్ పార్కు తరహాలో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక్కడే ఐదెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన క్రికెట్ స్టేడియాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ స్థలం చుట్టూరా ప్రహరీ నిర్మించడం, అందమైన పార్కుగా తీర్చిదిద్దే పనులను చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులన్నీ పూర్తైతే కాలనీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న క్రికెట్ స్టేడియం, పార్కు అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే ఆయా కాలనీలు, బస్తీలలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాన్నింటినీ ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. పార్కుల పచ్చదనంతో కేపీహెచ్బీ కాలనీ ఆక్సిజన్ హబ్గా మారిందన్నారు. కాలనీలో పార్కులను, క్రీడా ప్రాంగణాలను సద్వినియోగం చేసుకుని.. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలను కోరారు.
జూన్ 10న ఆర్వోబీ ప్రారంభం..
కూకట్పల్లిలో ట్రాఫిక్ కష్టాలు పరిష్కరించే దిశగా కైత్లాపూర్లో నిర్మించిన ఆర్వోబీని జూన్ 10న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే కృష్ణారావు తెలిపారు. కేపీహెచ్బీ కాలనీ హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు రాజీవ్గాంధీ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి, కాలనీ 7వ ఫేజ్ సమీపంలో ఆర్యూబీ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చామన్నారు. కైత్లాపూర్ మీదుగా అయ్యప్ప సొసైటీకి వెళ్లేందుకు నిర్మించిన ఆర్వోబీ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని.. తద్వారా ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. బాలానగర్లో నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జితో ఏండ్లనాటి ట్రాఫిక్ కష్టాలు తొలగాయన్నారు. కార్యక్రమంలో నియోజవర్గం కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, లోదా అపార్ట్మెంట్, మలేషియన్ టౌన్షిప్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్ తదితరులున్నారు.
బహుమతులు అందజేత..
క్రీడా పోటీలలో గెలుపు ఓటములు సహజమని, పోటీల్లో పాల్గొనప్పుడే క్రీడా ప్రతిభ వెలుగులోకి వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 7వ ఫేజ్లో నిర్మించిన ఎస్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో ఖాళీ స్థలాలన్నింటినీ క్రీడా ప్రాంగణాలుగా మార్చి క్రీడా అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులు, యువకులు చదువులతో పాటు ఆటలపై దృష్టిసారించి రెండింటిలో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, కోచ్ సురేశ్ పాల్గొన్నారు.