శేరిలింగంపల్లి / కొండాపూర్, మే 21: శేరి లింగంపల్లి బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు రచ్చకెక్కాయి. ఇరు వర్గాలకు చెందిన స్థానిక నియోజకవర్గ స్థాయి బీజేపీ నాయకులు, కార్పొరేటర్ అనుచరులు ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకుంటూ రోడ్డున పడ్డారు. బహిరంగంగా గోపన్పల్లి రహదారిపై ఘర్షణకు దిగడంతో పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. గోపన్పల్లిలో శనివారం జరిగిన ఘటనలో శేరి లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జి గజ్జెల యోగానంద్తో సహా పలువురు నాయకులు గచ్చిబౌలి డివిజన్ స్థానిక కార్పొరేటర్ గంగాధర్రెడ్డితో వాగ్వాదం రచ్చకెక్కింది.
భూ కబ్జాలకు పాల్పడ్డాడని ఆరోపణలతో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ గొడవలకు దిగడంతో శేరి లింగంపల్లి భారతీయ జనతా పార్టీ అంతర్గత విభేదాలు తేట తెల్లమయ్యాయి. బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన గజ్జెల యోగానంద్ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులకు గోపన్పల్లి గ్రామస్తులు, కార్పొరేటర్ గంగాధర్రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం, స్థానిక చందానగర్ పోలీసు స్టేషన్లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ఇరువైపుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే…
శేరి లింగంపల్లి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి గజ్జెల యోగానంద్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది గోవర్దన్ గౌడ్, శేరి లింగంపల్లి సీనియర్ నాయకులు మువ్వ సత్యనారాయణ, ప్రభాకర్ యాదవ్లు శనివారం ఉదయం గచ్చిబౌలి డివిజన్కు చేరుకున్నారు. గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్రెడ్డికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా గోపన్పల్లికి ప్రాంతానికి చేరుకున్న వారు కార్పొరేటర్కు చెందిన స్థలాన్ని ఫొటోలు, వీడియోలు తీస్తుండటంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు, కార్పొరేటర్ అనుచరులు అడ్డుకుని ప్రశ్నించారు. కార్పొరేటర్ లేకుండా ఆయన స్థలాన్ని, కార్యాలయాన్ని ఎందుకు ఫొటోలు తీస్తున్నారని నిలదీయడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యోగానంద్ బృంద సభ్యులు అడ్డువచ్చిన గ్రామస్తులు, కార్పొరేటర్ అనుచరులపై అనుచిత వాఖ్యలు చేస్తూ తీవ్ర పదజాలంతో దూషిస్తూ గొడవకు దిగారు. ఇదంతా ఇన్చార్జి యోగానంద్ సమక్షంలో బహిరంగంగా గోపన్పల్లి ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఆ ప్రాంతంలో కాసేపు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇంతలోనే అక్కడికి చేరుకున్న చందానగర్ పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. గజ్జెల యోగానంద్ వర్గం, గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్రెడ్డి వర్గాలు కాసేపటికి చందానగర్ పోలీసు స్టేషన్కు చేరుకుని ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. తనతో పాటు తన పీఏ మధువన్పై దాడికి పాల్పడ్డారంటూ శేరిలింగంపల్లి బీజేపీ నాయకులు మువ్వ సత్యనారాయణ కార్పొరేటర్ గంగాధర్రెడ్డితో పాటు అతని అనుచరులపై ఫిర్యాదు చేశారు. గంగాధర్రెడ్డి అనుచరులు, గోపన్పల్లి గ్రామస్తులు మువ్వ సత్యనారాయణపై సైతం ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులను స్వీకరించిన చందానగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కాస్ట్రో తెలిపారు.