బంజారాహిల్స్,మే 21: దశాబ్దాలుగా తీవ్రమైన వివక్షకు గురైన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పాటు ఆర్థికంగా స్వయం సమృద్దిని సాధించేలా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్రావు తెలిపారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని జ్ఞానీజైల్సింగ్నగర్లో రూ.10 లక్షల ఎమ్మెల్సీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాల్ను శనివారం ఎమ్మెల్యే దానం నాగేందర్తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ప్రభాకర్రావు మాట్లాడుతూ.. విద్య ద్వారానే దళితులు సమాజంలో అభివృద్దిని సాధిస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడంతో పాటు ఉన్నత విద్యకోసం వెళ్లాలనుకునే దళిత విద్యార్థులకు ప్రభుత్వం తరపున రూ.20లక్షల సాయం అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా దళితుల కుటుంబాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ..బీజేపీ నాయకులు కేవలం మాటలు చెబుతారని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వకపోగా ప్రారంభోత్సవాలకు వచ్చి రిబ్బన్ కటింగ్స్ చేస్తూ అభివృద్ధి జరగలేదని చెబుతుంటారని ఎద్దేవా చేశారు. దళిత బంధు పథకం కింద తొలిదశలో నియోజకవర్గానికి 100మంది లబ్ధిదారులను ఎంపిక చేశామని. త్వరలోనే మరో 1500 మంది లబ్ధిదారులకు సాయం అందిస్తామన్నారు. నాయకులు మామిడి నర్సింగరావు, మాల వెలుగు సంఘం నేతలు దండు లక్ష్మణ్, అనంతరామ్. అశోక్, నర్సింహ, పద్మ, గోపాల్ నాయక్, ఎల్లయ్య, రాము పాల్గొన్నారు.