సైదాబాద్, మే 21 : రూ.4కోట్ల వ్యయంతో చేపట్టిన సైదాబాద్ పోలీస్స్టేషన్ భవన నిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. సైదాబాద్ పాత పోలీస్స్టేషన్ శిథిలావస్థకు చేరటంతో దాన్ని కూల్చివేసి కొత్తగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు కొన్ని రోజులపాటు స్తబ్ధతగా కొనసాగినా.. ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల వరకు పనులను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పోలీస్స్టేషన్తోపాటు అదే ఆవరణలో కొనసాగుతున్న మహిళా కౌన్సెలింగ్ సెంటర్(భరోసా కేంద్రం) నిర్మాణ పనులు సైతం చివరి దశకు చేరుకున్నాయి. తాత్కాలికంగా ఎస్బీహెచ్ బ్యాంక్ కాలనీ కమ్యూనిటీ హాల్లో కొనసాగుతున్న పోలీస్స్టేషన్ను అక్కడి నుంచి ఖాళీ చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రాంతంలోకి తీసుకురానున్నారు.
ప్రజల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాల జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లు ఇప్పించి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. సైదాబాద్ రోడ్డు విస్తరణలో భాగంగా మలక్పేట ఏసీపీ కార్యాలయం పూర్తిగా కోల్పోతుండటంతో, ఏసీపీ కార్యాలయాన్ని కూడా ఇదే భవనంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఒక వైప్ పోలీస్స్టేషన్, మరోవైపు ఏసీపీ కార్యాలయానికి తక్షణ అవసరాలు ఉండటంతో భవన నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.