మియాపూర్, మే 18: తనకున్న మానసిక వైకల్యాన్ని తలుచుకుంటూ ఆ యువకుడు కుంగిపోలేదు. తన కాళ్లపై తాను నిలబడాలనుకున్నాడు. పట్టుదలతో చదివి మనోధైర్యంతో డెలివరీ బాయ్ ఉద్యోగం సాధించాడు. రెండేండ్లుగా ఓ ప్రముఖ కంపెనీలో విధులు నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నాడు లింగంపల్లికి చెందిన వినీత్రాజ్.
వైకల్యాన్ని ఎదురించి..
శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి ప్రాంతానికి చెందిన వినీత్రాజ్ (25) పుట్టుకతోనే బధిరుడు. తండ్రి రాజేందర్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మూగ, చెవిటి వాడైన వినీత్ పాఠశాల విద్యను పూర్తి చేసి డిగ్రీలో బీకాం కంప్యూటర్స్ పూర్తి చేశాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల మూలంగా ఉద్యోగం చేయాలని భావించి రెండేండ్ల క్రితం ఓ ప్రముఖ కంపెనీలో డెలివరీ బాయ్గా చేరాడు. తనకున్న సమస్యను అధిగమిస్తూ ప్రతిరోజు 5 నుంచి 10 వస్తువులు డెలివరీ చేస్తూ వినియోగదారుల నుంచి మన్ననలు పొందుతున్నాడు. సంక్షిప్త సందేశాల ద్వారా విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడు. వస్తువుల డెలివరీ సందర్భాల్లో వినీత్రాజ్ వైకల్యాన్ని గుర్తిస్తున్న వినియోగదారులు ఆయన మనోధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.