సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలోని పౌర సేవలు ఒక్కొక్కటిగా ‘మీ -సేవ’ పరిధిలోకి వచ్చి చేరుతున్నాయి. కస్టమర్ సర్వీస్ సెంటర్లు (పౌర సేవా కేంద్రాలు) ద్వారా అందుతున్న సేవలను మరింత సులభతరం చేస్తూ ఇప్పటికే జనన, మరణ ధ్రువపత్రాల సేవలను పూర్తిగా ఈ సేవా కేంద్రాలకు బదలాయించిన అధికారులు.. తాజాగా ఆస్తిపన్ను స్వీయ మదింపు, పునర్ మదింపు, మ్యుటేషన్ వంటి సేవలను ‘మీ-సేవ’ ద్వారా అందించాలని నిర్ణయించారు. త్వరలో అమలు చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ముందస్తుగా ఆస్తిపన్ను చెల్లించే వారికి 5 శాతం రిబేట్ ప్రకటిస్తూ జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ స్కీంను ప్రవేశపెడుతూ వస్తున్నది. ఈ స్కీంను అంచనాకు మించి చెల్లింపుదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు.
గత ఏప్రిల్లో ఎర్లీబర్డ్ లక్ష్యం రూ.600 కోట్లు ఉంటే దాదాపుగా రూ. 740 కోట్లకు పైగా ఆదాయాన్ని సమకూర్చుకున్నది. ఎక్కువ శాతం ఆస్తిపన్ను చెల్లింపులకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆన్లైన్ విధానాన్ని సద్వినియోగం చేసుకుంటుండటం, క్షేత్రస్థాయిలో కొందరు ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల పనితీరులో విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ‘మీ సేవ’ వైపు అధికారులు అడుగులు వేశారు. ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్ల సేవలను ఇతర పనులకు వినియోగించాలని భావిస్తున్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారుల విషయానికొస్తే పన్ను చెల్లించకుండా ఉన్న వారికి తరచూ ఎస్ఎంఎస్లు పంపడం, బకాయిదారులు లేకుండా చర్యలు తీసుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా సిద్ధం చేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.