ముషీరాబాద్, మే 18: వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఎంపిక చేయడంపై పలు బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు బుధవారం విద్యానగర్లోని బీసీ భవన్లో సంబురాలు చేసుకున్నారు. పలు కులసంఘాల నాయకులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న బీసీ, ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘాల నేతలు, విద్యార్థి సంఘాల నాయకులు కృష్ణయ్యను కలిసి ఘనంగా సత్కరించారు.
పార్లమెంటులో బీసీ వాణి వినిపిస్తా..
పార్లమెంటు వేదికగా దేశవ్యాప్తంగా బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తానని ఆర్. కృష్ణయ్య తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో బీసీ గళం వినిపించే అవకాశం వచ్చిందని, బీసీల హక్కులు, సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తాననన్నారు. బీసీ కులగణన, ప్రత్యేక మంత్రిత్వశాఖ, పార్లమెంటులో బీసీ బిల్లు కోసం ఒత్తిడి తెస్తానని స్పష్టం చేశారు.
ఉద్యోగ, బీసీ,కులసంఘాలు హర్షం
కాచిగూడ, మే 18 : నలభై ఏండ్లుగా బీసీల సమస్యలపై పోరాటం చేస్తున్న బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యను ఏపీ ప్రభుత్వం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై 20 ఉద్యోగ సంఘాలు, 28 బీసీ సంఘాలు, 36 కుల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో బుధవారం కాచిగూడలోని ఓ హోటల్లో జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణతో కలిసి మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు దాటినా బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో న్యాయం జరడం లేదని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కోలా జనార్దన్, అంజి, పండరీనాథ్, జయంతిగౌడ్, మురళీమోహన్, ఏపీ అధికార ప్రతినిధి వేణుమాధవ్, మంజులగౌడ్, శివకుమార్, రమ తదితరులు పాల్గొన్నారు.