గోల్నాక, మే 18: అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన మూడు వేర్వేరు చోరీ కేసుల్లో బుధవారం ఐదుగురు దొంగలను అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. అంబర్పేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మలక్పేట డివిజన్ ఏసీపీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్ పి.సుధాకర్, డీఐ హెచ్.ప్రభాకర్తో కలిసి ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ సి.సతీశ్ వివరాలను వెల్లడించారు. రాంరెడ్డినగర్కు చెందిన వై.రమణమ్మ ఈనెల 12న శ్రీరమణ చౌరస్తా మీదుగా నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఖాద్రీబాగ్ వద్ద ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తెల తాడును దుండగులు తెంచుకుపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారు. నిందితుడు వెంకటేశ్( 24)ను బాగ్అంబర్పేట మల్లికార్జుననగర్లో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద మూడు తులాల బంగారు పుస్తెల తాడును స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించారు.
ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీ..
అంబర్పేట మున్సిపల్కాలనీలో నివాసముంటున్న ఎం.నరేందర్ ఇంట్లో ఈనెల14న చోరీ జరిగింది. దొంగతనానికి పాల్పడిన తురాబ్నగర్కు చెందిన దాత్రిక్ మానవ్ (23), పాముల బస్తీకి చెందిన సాయికుమార్(18), మల్లికార్జునగర్కు చెందిన ఎం.సుమలత(26) అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 2 తులాల బంగారు పుస్తెల తాడు, సామ్సాంగ్ ట్యాబ్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు.
మరో కేసులో రెండు బైకులు స్వాధీనం
అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో బైకులు దొంగిలిస్తున్న ప్రేమ్నగర్కు చెందిన ఆర్.సాయికిరణ్(34)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి రెండు హీరో హోండా బైక్లను స్వాధీనం చేసుకొని, రిమాండ్కు తరలించారు.