హిమాయత్నగర్, మే18: దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని విచ్ఛినం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్ని స్తోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,నగర అధ్యక్షుడు ఈ.టీ నరసింహ ఆరోపించారు. బుధవారం హిమాయత్నగర్లోని ఎస్ఎన్రెడ్డి భవన్లో సీపీఐ నగర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఈ దేశానికి అందించిన రాజ్యాంగ పునాదులను దెబ్బతిస్తూ మనుస్మృతిని చట్టాన్ని చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ కుట్ర చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం, లౌకికవాదంపై దాడి చేస్తున్నాయని, వాటిని అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. పేద ప్రజలకు కావాల్సిన మౌలిక సౌకర్యాలను కల్పించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశంలో సీపీఐ నగర కార్యవర్గ సభ్యులు ఎం.నరసింహ, ఎస్.ఛాయాదేవి, స్టాలిన్, చంద్రమోహన్గౌడ్, మన్నన్, ఎన్. శ్రీకాంత్, ఎండీ సలీం,వెంకటయ్య,సక్రిబాయి, అమీనా, మహమూద్ పాల్గొన్నారు.