బోడుప్పల్, మే 18: చెరువులు నిండుకుండలా మారితే స్థానికులు, పరిసర ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు.కానీ బోడుప్పల్ నగరపాలక సంస్థ చెంగిచర్ల చింతల చెరువులోకి నీరు సంవృద్ధిగా చేరడంపై స్థానికుల నుంచి బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చెరువులోకి చేరిన నీటిపై వివాదం మొదలైంది. చెరువులో చేరుతుంది వర్షపునీరు కాదు.. డ్రైనేజీ నీరు.. కలుషిత జలాలు అని, దుర్వాసన వెదజల్లుతున్నదని స్థానికులు పేర్కొన్నారు. ఈ నీటిని తొలగించి ఉపశమనం కలిగించాలని కాలనీవాసుల నుంచి అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ మేరకు స్పందించిన ఇరిగేషన్ అధికారులు బుధవారం తూం తొలగించడానికి ప్రయత్నించగా కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. అనుమతి లేనిదే తన వ్యవసాయ భూమిలోకి ప్రవేశించి తన ప్రహరీ గోడను తొలగించారని ఆర్.కమలాకర్రెడ్డి మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జేసీబీని సీజ్చేసి మేడిపల్లి పోలీసు స్టేషన్కు తరలించారు. చెరువు తూం తొలగిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న స్థానిక నాయకులు బుధవారం చింతల చెరువు కట్టపైకి చేరుకుని కమలాకర్రెడ్డికి సంఘీభావం పలికారు. దీంతో కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
కలుషిత నీటితో ఇబ్బందులు..
చెంగిచర్ల ఎగువ కాలనీల నుంచి వస్తున్న డ్రైనేజీ మురుగు నీరు, కలుషిత జలాలు నేరుగా చింతల చెరువులోకి చేరుకుంటున్నాయి. దీంతో పరిసర కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చెరువు తూం ద్వారా నీటిని తొలగించేందుకు చేసిన ప్రయత్నంలో ఎలాంటి దురుద్దేశం లేదు.
– డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్
ఎఫ్టీఎల్ పరిధి ప్లాట్లను కొల్లగొట్టేందుకే..
చెంగిచర్ల చింతల చెరువులోని నీటిని తొలగించి ఎఫ్టీఎల్ ప్లాట్లను కొల్లగొట్టేందుకే తూం ద్వారా నీటిని తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ లేని సమస్యను సృష్టించి తూం తెరువాలని ప్రయత్నిస్తున్నారు. మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జేసీబీని సీజ్ చేశారు.
– ఆర్. కమలాకర్రెడ్డి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..
డీఈ, ఈఈ ఆదేశాల మేరకు తూం తెరవడానికి ప్రయత్నం చేశాం. చెరువు తూంకు అడ్డంగా కమలాకర్ రెడ్డి ప్రహరీ నిర్మించాడు. తొలగించాల్సి వచ్చింది. ఎఫ్టీఎల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
– ఇరిగేషన్ ఏఈ పరమేశ్