సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): లోన్ యాప్లలో పాత డేటాను సేకరించి, కొత్తగా వేధింపులకు పాల్పడుతున్నారు. తాము ఎలాంటి రుణం తీసుకోలేదని చెప్పినా.. లింక్ క్లిక్ చేసి ఒకసారి తనిఖీ చేసుకోవాలని సూచిస్తున్నారు. లింక్ క్లిక్ చేయగానే సెల్ఫోన్లోని కాంటాక్టులన్నీ చోరీ అవుతున్నాయి. ఆ కాంటాక్టులతో లోన్యాప్ సైబర్నేరగాళ్లు నయా పంథాలో అమాయకులను బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తమకు ఎలాంటి సంబంధం లేకుండానే వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఏడాది విరామం తరువాత లోన్యాప్లలో వేధింపులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో కుల్సుంపురా ప్రాంతంలో ఒక యువకుడు వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరిగి లోన్ యాప్ల వేధింపులు పెరుగుతుండడంతో పోలీసులు ఈ కేసుల దర్యాప్తుపై ఫోకస్ పెట్టారు.
గతంలో లోన్ తీసుకున్న వారు, వారి కాంటాక్టులను గతంలో కాల్సెంటర్లు నిర్వహించిన ఆయా లోన్ యాప్ సంస్థలు తమ వద్ద భద్రంగా దాచుకున్నాయి. పోలీసుల దర్యాప్తులో కాల్సెంటర్ల నిర్వాహకులు, యాప్ల నిర్వాహకులు పట్టుబడ్డారు. లోన్యాప్ల వెనుక చైనీయులే ఉన్నారు. హైదరాబాద్లో గత ఏడాది లోన్యాప్లపై కేసులు నమోదు కావడంతోనే అప్పటి వరకు ఢిల్లీ కేంద్రంగా యాప్లను నడిపించిన కొందరు చైనీయులు దేశం విడిచి వెళ్లిపోయారు. చైనాకు చెందిన లాంబో పోలీసులకు పట్టుబడ్డాడు. లాంబో సహా 24 మందిని అప్పట్లో పోలీసులు అరెస్ట్ చేశారు. లాంబో మినహా మిగతా వారు బెయిల్పై బయటకు వచ్చారు. లాంబో ఇతర రాష్ర్టాలలో నమోదైన కేసులలో జైలు జీవితం అనుభవిస్తున్నాడు.
ఇదిలాఉండగా మూడు నెలలుగా తిరిగి లోన్ యాప్లు తమ కార్యకలాపాలను విస్తృ తం చేశాయి. కొత్తగా లోన్లు ఇస్తామంటూ ముం దుకొచ్చిన బాధితుల వద్ద ముక్కుపిండి వడ్డీ సహా పూర్తిగా వసూలు చేస్తున్నారు. తమ వద్ద డేటాతో మరింత డబ్బు మాకు చెల్లించాలని బ్లాక్మెయిలింగ్కు దిగడంతో కొందరు బెంబేలెత్తిపోతున్నారు. మరికొందరు ధైర్యం గా ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు బ్లాక్మెయిలింగ్లకు తలొగ్గి ఎంతో కొంత చెల్లిస్తున్నారు. అయితే గతంలో రుణాలు తీసుకొని చెల్లించిన వారు, చెల్లించనివారు, వారి కాంటాక్టు లిస్ట్లు అప్పట్లో ఆయా యాప్ల నిర్వహణ చేసిన వారి వద్ద ఉన్నాయి. ఇప్పుడు ఆ డేటాను కొందరు సేకరించి,వారి ఫోన్ల కు మేసేజ్లు పంపిస్తున్నారు. మీ బాకీ ఇంకా పెండింగ్లో ఉంది… కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చని ఒక లింక్ను పంపిస్తున్నారు. ఆ లింక్ క్లిక్ చేయగానే ఆటోమెటెక్గా సెల్ఫోన్లోని డాటా లిం క్ పంపించిన వారి సెల్ఫోన్లోకి కాపీ అవుతుంది. ఇక అక్కడి నుంచి తాజాగా సేకరించిన కాంటాక్టులకు బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు.
రంగంలోకి ప్రత్యేక బృందాలు
లోన్యాప్లలో నమోదువుతున్న కేసుల దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, ఈశాన్య రాష్ర్టాలకు సైబర్క్రైమ్ ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. నేరగాళ్లు ఎక్కువగా ఇంటర్నెట్ ఫోన్కాల్స్, వాట్సాప్ కాల్స్ ఉపయోగిస్తున్నారు. గతంలో మాదిరిగా కాల్సెంటర్లు కాకుండా, వ్యక్తిగతంగా ఇండ్లలో కూర్చొని కాల్స్ చేయడం, మేసేజ్లు చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని పోలీసుల దర్యాప్తులో బయటపడింది. ఈ నేపధ్యంలో సాంకేతిక ఆధారాలతో నేరగాళ్లను గుర్తించి పట్టుకోవడంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.