సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : ఢిల్లీలో తాత్కాలిక మకాం.. ఇంటర్నెట్ వేదికలో లండన్లో నివాసం. ఇలా ఓ యువతికి రూ.11 లక్షలు టోకరా వేసిన పశ్చిమ ఆఫ్రికాలోని కొటె డివౌయిర్ దేశానికి చెందిన ఓ సైబర్ నేరగాడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమరా ఫన్నీ స్టూడెంట్ వీసాపై ఇండియాకు వచ్చి ఢిల్లీ ద్వారకలో నివాసముంటున్నాడు. నైజీరియన్ దేశానికి చెందిన వారితో పరిచయం పెంచుకొని సైబర్ మోసాలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
అమరా ఫన్నీ, నైజీరియా దేశానికి చెందిన ఐ.కె.ఫినిచ్తో కలిసి మ్యాట్రిమోనిలో మోసాలు చేసేందుకు పథకం వేసుకున్నారు. దీని కోసం వారి ఫొటోలు కాకుండా ఇంటర్నెట్లో నుంచి అందమైన యువకుల ఫొటోలను తీసి, ఇతర పేర్లతో ఈ మెయిల్ ఐడీలను సృష్టించి వాటిని అన్ని మ్యాట్రిమోని వెబ్సైట్లలో పెట్టారు. ఇలా అమరా ఫన్నీ సృష్టించిన ప్రొఫైల్ను చూసిన ఎల్బీనగర్కు చెందిన ఓ యువతి బోల్తాపడింది. లండన్ లివర్పూల్లో డాక్టర్నంటూ.. పెండ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు.
ఇండియాకు వచ్చానని, ఢిల్లీ ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారని మాయ మాటలు చెప్పి యువతి నుంచి రూ.11 లక్షలు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు అడుగుతుండటంతో యువతికి అనుమానం వచ్చి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించిన రాచకొండ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో నిందితుడిని అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ మీద నగరానికి తీసుకువచ్చి రిమాండ్కు తరలించారు. అతడికి సహకరించిన ఫినిచ్ అనారోగ్యంతో దవాఖానలో ఉండటంతో అతడికి 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కాజేసిన డబ్బును షూస్ వ్యాపారం రూపంలో మొత్తం వారి దేశానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు.