కేపీహెచ్బీ కాలనీ, మే 17 : ఇరువై రోజుల్లో కైత్లాపూర్ ఆర్వోబీ అందుబాటులోకి వస్తుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మంగళవారం కైత్లాపూర్ అయ్యప్ప సొసైటీ ఆర్వోబీ నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దడంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్లు ట్రాఫిక్ సమస్యలపై దృష్టినిసారించినట్లు తెలిపారు. వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఫ్లై ఓవర్, అండర్పాస్ బ్రిడ్జిల నిర్మాణంలో భాగంగా బాలానగర్లో, కేపీహెచ్బీ కాలనీ రాజీవ్గాంధీ చౌరస్తాలో ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, కాలనీ 7వ ఫేజ్ సమీపంలో అండర్పాస్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.
కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీకి వెళ్లేందుకు కాలనీ 4, 7వ ఫేజ్లలో ఉన్న ఏకైక ఆర్వోబీ బ్రిడ్జితో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కైత్లాపూర్ నుంచి అయ్యప్ప సొసైటీకి ఆర్వోబీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. పనులు చివరి దశకు చేరుకోవడంతో జూన్ 2వ వారంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆర్వోబీ ప్రారంభమవుతుందని తెలిపారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పగుడాల శిరీష, సబీహాబేగం, జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ బాబురావు, జీహెచ్ఎంసీ ప్రాజెక్టు విభాగం అధికారులు పాల్గొన్నారు.