కుత్బుల్లాపూర్, మే 17 : సమష్టి కృషితో కొంపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటామని చైర్మన్ సన్న శ్రీశైలంయాదవ్ అన్నారు. మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయా వార్డులో నెలకొన్న సమస్యలు, ప్రజలకు కల్పించాల్సిన మౌలిక వసతులు, ఇతర సదుపాయాలపై చర్చించారు. 18 వార్డుల్లో వివిధ రకాలైన అభివృద్ధి పనులైన రోడ్లు, మురుగునీటి కాలువలు, పార్కులు, ఓపెన్జిమ్లు, హరితహారం, పారిశుధ్యంతో పాటు శ్మశానవాటికల అభివృద్ధి కోసం రూ. 2 కోట్ల 44 లక్షల 14 వేల నిధులు కేటాయించేందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అనంతరం కౌన్సిల్ సభ్యులు లేవనెత్తిన పలు సమస్యలను వెనువెంటనే పరిష్కరించేలా కృషి చేస్తామని అధికారులు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రత్లావత్ గంగయ్యనాయక్, కమిషనర్ రఘు, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, డీఈఈ బి.చిరంజీవులు, మేనేజర్ ఎస్.వెంకటేశం, ఏఈ ప్రవీణ్, టీపీఓ అలీపాషా, డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్, హెచ్ఎండబ్ల్యూస్ మేనేజర్ పి.రవీందర్, విద్యుత్ లైన్మన్, ఫోర్మన్తో పాటు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.