సికింద్రాబాద్, మే 17: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఆర్మీ సబ్ ఏరియాల్లో పనిచేయుటకు రెండు నెలల క్రితం కాంట్రాక్టర్లను ఏర్పాటు చేయడం జరిగిందని కొత్తగా వచ్చినటువంటి బెస్ట్ సెక్యూరిటీ, ఓరియంటల్ కాంట్రాక్ట్ అనే సంస్థలు ఏప్రిల్ నెల జీతం చెల్లించకుండా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం. నర్సింహ విమర్శించారు. ఈ క్రమంలో మంగళవారం కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నర్సింహ మాట్లాడుతూ కార్మికులకు ప్రతినెలా ఏడో తేదీ లోపు జీతాలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ సదరు రెండు కాంట్రాక్టులు కంటోన్మెంట్ బోర్డు ఆదేశాలను సైతం పాటించటం లేదన్నారు. దీంతో కాంట్రాక్టర్లపైనా తగిన చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని వారు బోర్డు అధికారులను కోరారు. ఆర్మీ ఏరియాలలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న కార్మికులకు సక్రమంగా జీతాలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం కంటోన్మెంట్ సీఈవోతో ఫోన్లో మాట్లాడి కార్మికుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.