మహేశ్వరం, మే 17: గ్రామాల నుంచి వలసలను నిరోధించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పిస్తున్నది. మండలం వ్యాప్తంగా మొత్తం 10,300 జాబ్ కార్డులున్నాయని అధికారులు తెలిపారు. జాబ్కార్డు దారులు ఉపాధి హామీ కూలీ పనులు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆర్థిక ఇబ్బందులు పడకుండా గుర్తింపు కార్డులు పొందిన ప్రతి ఒక్కరికీ పనులు కలిపిస్తున్నామని అధికారులు చెప్పారు. గ్రామాల్లో ముఖ్యంగా చెరువుల్లో మరమ్మతు పనులు, పూడికతీత, రోడ్ల నిర్మాణం, పొలం కాలువల నిర్మాణం, హరితహారంలో మొక్కలు నాటడం, మొక్కలకు కందకాలు తీయడం వంటి అనేక రకాల పనులను ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలకు కల్పిస్తున్నామని అధికారులు అంటున్నారు. కూలీలకు రోజుకు రూ.247 చెల్లిస్తున్నారు. మహేశ్వరం మండలంలో దుబ్బచెర్ల, డబిల్గూడ, సిరిగిరిపురం, పెద్దమ్మతండా, పోరండ్ల, కల్వకోల్, కోళ్లపడకల్, తదితర గ్రామాల్లో ఉపాధిహామీ పనులు జోరుగా జరుగుతున్నాయి. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా గ్రామాల్లోనే పనులను కల్పిపిస్తుండటంతో కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా తండాలోనే పనులు
ప్రతి రోజు ఉదయాన్నే లేచి ఉపాధి పనులకు పోతున్నాం. కూలీలకు కొలతల ప్రకారం పనులు ఇస్తారు. ఆ కొలతల ప్రకారం పనులు పూర్తిచేస్తాం. ఇతర గ్రామాలకు వెళ్లకుండా మా తండాలోనే పనులు దొరుకుతున్నాయి. మాకు కూలీ దొరుకుతుందనే భరోసా కలుగుతుంది. కూలీ చేయనిదే ఇల్లు గడవది. ప్రభుత్వం పనులను ఇస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది.
– నెనావత్ లాలి, పెద్దమ్మతండా, ఉపాధిహామీ కూలీ.
సద్వినియోగం చేసుకోవాలి
కూలీలు ఉపాధి హామీ పనులను వినియోగించుకోవాలి. మండలంలోని మహేశ్వరం, సిరిగిరిపురం, కల్వకోల్, కోళ్లపడకల్, సుభాన్పూర్, పెద్దమ్మ తండాలో ఉన్న గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగిస్తున్నాం. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులను కూలీలకు కల్పిస్తున్నాం. జాబ్కార్డు ఉన్న వారందరూ ఉపాధి పనులు చేసుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జాబ్ కార్డుదారులందరికీ పనిని కల్పిస్తాం.
– నర్సింహులు, ఎంపీడీవో