శేరిలింగంపల్లి, మే 17 : పేద, మధ్య తరగతి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలనే లక్ష్యంతో మధ్య తరగతి వర్గాల ప్రజల శుభకార్యాలకు కల్యాణ మండపం అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మించ తలపెట్టిన మల్టీపర్పస్ కల్యాణ మండపం అసంపూర్తిగా మిగిలిపోయింది. శేరిలింగంపల్లి సర్కిల్-20 పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి తండా గ్రామస్తులకు అందని ద్రాక్షలా మారింది. అంచనా వ్యయం రూ. 2కోట్లతో పను లు ప్రారంభించి 5 సంవత్సరాలు గడుస్తున్నా.. నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. అధికారులు, కాంట్రాక్టర్ల అలసత్వం కారణంగానే కల్యాణ మండపం పనులు మధ్యలోనే ఆగిపోయినట్లు గ్రామస్తులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పనులు పూర్తి చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రీడిజైనింగ్ కారణంగా పనులు ఆలస్యం..
మల్టీపర్పస్ కల్యాణ మండపం నిర్మాణం కోసం రూ. 1.2కోట్లతో పనులు ప్రారంభించగా అనంతరం చోటు చేసుకున్న రీడిజైనింగ్ కారణంగా అదనపు పనుల నిర్వహణ చేపట్టాల్సి వచ్చింది. దీంతో కల్యాణ మండపం పనులు అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. అనంతరం తిరిగి పనులు ప్రారంభికపోవడంతో నేటికీ అలంకారణ ప్రాయంగా కల్యాణ మండపం దర్శనమిస్తున్నది. ఈ విషయమై అధికారులను వివరణ కోరగా త్వరలో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.