మేడ్చల్ రూరల్, మే 17 : పశు వైద్యశాలలు ఏర్పాటు చేసి, గొర్రెలు, మేకలకు వైద్య సౌకర్యం మెరుగుపర్చాలని గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల జంగయ్య, కార్యదర్శి రవీందర్ అన్నారు. మేడ్చల్లో మంగళవారం గొర్రెలు, మేకల పెంపకం దారుల జిల్లా మహా సభలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ.. గొర్రెలు, మేకలకు సరైన వైద్యం అందించేందుకు వైద్యశాలల ఏర్పాటుతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రభుత్వం రెండో విడుత గొర్రెలను ఇవ్వాలని, బీమా మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించాలని కోరారు. పలు ప్రాంతాల్లో అటవీశాఖ అధికారులు గొర్రెల మేతకు అడ్డుపడుతున్నారని, వేధింపులకు దిగుతున్నారని పేర్కొన్నారు. వారి వేధింపుల నుంచి విముక్తి కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా మేకల కుమార్
జిల్లా అధ్యక్షుడిగా మేకల కుమార్ను ఎన్నుకోగా, కార్యదర్శిగా ఎక్కలదేవి కొమురయ్య, ఉపాధ్యక్షులుగా సానం మల్లేశ్, నల్ల రాములు, వడ్డెల బాలయ్య, బండారి మల్లేశ్, సహాయ కార్యదర్శులుగా వెంకటేశ్, ఆంజనేయులు, గాజుల వీరేందర్, భవానీ వెంకటేశ్ను ఎన్నుకున్నారు. వారితో పాటు మరో 16 మందిని కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.