చర్లపల్లి, మే 17 : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసేలా పాలన చేస్తుందని సీపీఐ రాష్ట్ర నాయకుడు దామోదర్రెడ్డి, ఏఐటీయూసీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంకర్రావు విమర్శించారు. ఏఎస్రావునగర్ డివిజన్ పరిధిలోని కమలానగర్, నీలం రాజశేఖర్రెడ్డి భవనంలో సీపీఐ నాయకుడు నర్సింహ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి పేద, మధ్య తరగతి ప్రజలను మోసం చేసిందన్నారు. అదేవిధంగా గ్రామీణ ఉపాధి హామి పథకం నీరుగారిపోయిందని, పనిదినాలను తగ్గించడంతో ఇబ్బందులు ఎదురువుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేసేందుకు వామపక్షాల ఆధ్వర్యంలో ఈ నెల 25 నుంచి 31వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సత్యప్రసాద్, ధర్మేంద్ర, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు సతీశ్కుమార్, సీపీఐ నేతలు కృపాకర్, సాయిలు, జోషి, రాకేశ్, సునీల్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.