ఎర్రగడ్డ, మే 16: సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తలపెట్టిన ‘సమస్యలపై శంఖారావం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. బోరబండ డివిజన్లో 3వ రోజు కొనసాగిన ఈ కార్యక్రమంలో భాగంగా సైట్-4, సైట్-5 కాలనీలు, సాయిబాబానగర్ తదితర బస్తీల్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసిన గోపీనాథ్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలి వచ్చి తమతమ బస్తీలోకి ఆహ్వానించటం విశేషం. స్థానికులు సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లటం.. ఎమ్మెల్యే ఆదేశానుసారం సంబంధిత అధికారి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవటం.. దీంతో బస్తీలవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బల్దియా డిప్యూటీ కమిషనర్ రమేశ్తో పాటు టౌన్ప్లానింగ్, జలమండలి, రెవెన్యూ, పోలీస్, విద్యుత్ శాఖల అధికారులు ఎమ్మెల్యేతో పాదయాత్రలో పాల్గొనటం వల్ల స్థానికంగా నెలకొన్న సమస్యలు వెంటనే పరిష్కారానికి నోచుకుంటున్నాయి.
సంపూర్ణ అభివృద్ధే ధ్యేయం..
నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయటమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తూ ప్రజల కోసం సమయాన్ని వెచ్చిస్తామన్నారు. పాదయాత్రలో భాగంగా బోరబండ డివిజన్లో గుర్తించిన సమస్యల పరిష్కారానికి గాను ఇప్పటికే రూ.2 కోట్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. ఇక సమస్యలపై శంఖారావం కార్యక్రమాన్ని ఏటా నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయకుమార్, టీఆర్ఎస్ డివిజన్ కోఆర్డినేటర్ విజయసింహారెడ్డి, ఫయాజ్ఖాన్, రమేశ్నాయక్, సయ్యద్ఖమర్, యూసుఫ్, డేవిడ్ సరళ, లక్ష్మణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.