జవహర్నగర్, మే 16 : అంతరించిపోతున్న కులవృత్తులకు పునరుజ్జీవం పోసి వారి పెదాల్లో చిరునవ్వును నింపారు సీఎం కేసీఆర్. ఉమ్మడి పాలనలో కులవృత్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతరించిపోతున్న కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వం సంజీవనిలా నిలిచింది. కల్లు తాగడానికి ఎక్కడికో పోకుండా ఒకే దగ్గర తోటలాగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో గీత కార్మికుల కోసం పెద్దపీట వేసూ, స్థలాలు కేటాయించి ఈత మొక్కలు నాటారు. జవహర్నగర్ కార్పొరేషన్లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి హరితహారంలో భాగంగా 2018 సంవత్సరంలో 3635 ఈత మొక్కలు నాటారు.
ఈత వనానికి ప్రత్యేక సంరక్షణ
కార్పొరేషన్లో గౌడ వృత్తిని సంరక్షిస్తూ ప్రభుత్వం వారి కోసం ఐదెకరాల స్థలాన్ని కేటాయించి 3635 ఈత మొక్కలు నాటారు. ఈతవనంలో మొక్కలను సంరక్షించడానికి ప్రత్యేకంగా మనుషులను కేటాయించి ఎప్పటికప్పుడు మొక్కలకు ఎరువు, నీటిని అందిస్తుండటంతో పచ్చని ఈతవనంగా తయారైంది. త్వరలో నీరా తీస్తామని గౌడ కులస్తులు తెలిపారు.
మంత్రి సహకారంతోనే అభివృద్ధి..
మంత్రి చామకూర మల్లారెడ్డి సహకారంతోనే ఈత వనం అభివృద్ధికి నోచుకున్నదని గౌడ కులస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈత వనం సంరక్షణకు రెండు బోర్లు వేయించి ప్రతి మొక్కకు సమృద్ధిగా నీటిని అందిస్తున్నారు. ఈత మొక్కలకు కార్పొరేషన్లోని రాంకీ సంస్థ ఎరువు అందిస్తుండటంతో అతి తక్కువ సమయంలోనే ఏపుగా పెరిగాయి. జవహర్నగర్ కార్పొరేషన్ గౌడన్నలకు టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈత చెట్ల నుంచి నీరాను తీస్తాం..
సీఎం కేసీఆర్ గౌడ కులస్తులకు పెద్దపీట వేశారు.అంతరించిపోతున్న కుల వృత్తులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉపాధి కల్పిస్తూ గౌడన్నలను ధనికులుగా తయారు చేశారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో ఈతవనానికి రక్షణ కల్పించి ప్రతి చెట్టును కాపాడుకున్నాం. ఈత చెట్ల నుంచి త్వరలోనే నీరాను తీస్తాం. ఈత చెట్ల నుంచి వచ్చే కల్లు ప్రకృతి సహజంగా వస్తుంది. ఒకే దగ్గర ఈత చెట్లను పెంచి నీరా, కల్లును ప్రజలకు అందించాలనే ఆలోచన రావడం సంతోషంగా ఉంది. కులవృత్తిలో ఏదైనా ప్రమాదం సంభవిస్తే ప్రమాదబీమా కల్పిస్తూ సీఎం ఆదుకుంటున్నారు.ఈతవనం మహా అద్భుతంగా అభివృద్ధి చెందింది.
– శంకర్గౌడ్, మాజీసర్పంచ్, జవహర్నగర్