ఘట్కేసర్,మే 16 : పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో పచ్చని మామిడి తోరణాలు, పూలతో అలంకరించిన పచ్చని పందిట్లో శ్రీపద్మావతి, వేంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు పూజారులు జీలకర బెల్లం సమర్పణ, కన్యాదాన కార్యక్రమం, మంగళసూత్ర ధారణ నిర్వహించి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. అనంతరం భక్తుల దర్శనం, తీర్థ ప్రసాదాలు, కట్నకానుకల సమర్పణ, అన్నప్రసాద వితరణ చేశారు.
స్వామి వారి కల్యాణ మహోత్సవం ఆలయ ఈఓ భాగ్యలక్ష్మి, చైర్మన్ పి.రాజేశ్ గౌడ్ల ఆధ్వర్యంలో జరుగగా, మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ రాజేశ్గౌడ్ ఆలయ అభివృద్ధికి అందజేసిన రూ.5లక్షల చెక్కును మంత్రి ద్వారా ఎండోమెంట్కు పంపించారు. పోచారం చైర్మన్ బి.కొండల్రెడ్డి, పార్టీ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, ఘట్కేసర్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ధర్మకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.