ముషీరాబాద్, మే 16: బౌద్ధుల జీవితాలు ఉన్నతంగా ఉండాలని నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలబోయిన సుదర్శన్ అన్నారు. బుద్ధిస్ట్ మైనార్టీస్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సోమవారం త్యాగరాయ గానసభలో 2566వ బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ బౌద్ధుల జీవితాలు 2000 సంవత్సరాల నాటికి కూడా గొప్పగా చెప్పుకునేలా ఉండాలని అన్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లలో బౌద్ధం అనేక రకాలుగా విస్తరిస్తున్నదని వివరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన చిన్నారులకు బహుమతులు, సర్టిఫికెట్లు, నగదు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ హైరింగ్, ఐటీ డెలివరీ డైరెక్టర్ రాజనర్సయ్య బండా, భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్, నేషనల్ బుద్ధిస్ట్ అవార్డు గ్రహీత మార్వాడి గంగారాజు, ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాదర్శి మాదాసు రాజేందర్, వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి శ్యామ్, కోశాధికారి ఎం.రమేశ్ పాల్గొన్నారు.