మొయినాబాద్, మే 16: తిరుమల కొండపై అన్నమయ్యకు సముచిత స్థానం కల్పించాలని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు. అన్నమయ్య 614 జయంతి సందర్భంగా తిరుమల తిరుపతి కళాక్షేత్రం పీఠాధిపతి విజయశంకర్ స్వామి, జై భారత్ సంస్థ సహకారంతో సోమవారం చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద ఉపవాస దీక్ష, అన్నమయ్య హరినామ కీర్తన పారాయణం చేపట్టారు. ఈ సందర్భంగా అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ పద కవిత హరినామ కీర్తనలతో అన్నమయ్య వెంకటేశ్వరస్వామికి ఎనలేని సేవలు అందించారని పేర్కొన్నారు. సుమారుగా 32 వేల కీర్తనలు రచించి స్వామి వారికి అంకితం చేసిన మహానీయుడని, ఆయన ఎందరికో ఆదర్శం అయ్యాడని చెప్పారు. మాస్టర్ ప్లాన్ పేరుతో టీటీడీ అన్నమయ్య నివాసాన్ని తప్పిదం చేస్తుందని అన్నారు. ఇప్పటికైనా టీటీడీ వారు స్పందించి తిరుమల కొండపై అన్నమయ్యకు సముచిత స్థానం కల్పించాలన్నారు. కార్యక్రమంలో తిరుమల తిరుపతి కళాక్షేత్రం పీఠాధిపతి జయశంకర్ స్వామి, జై భారత్ జాతీయ కార్యదర్శి ఖదిజ్ఞాసి, లోక్నాథ్, జానపద కళాకారుల బృందం, తదితరులు పాల్గొన్నారు.