సిటీబ్యూరో, మే 16(నమస్తే తెలంగాణ) : రియల్ మాఫియాల ఆగడాలు పెరిగిపోతున్నాయి. ఖాళీ స్థలాలను కాజేసేందుకు ఏకంగా నకిలీ యజమానులను సృష్టిస్తున్నారు. అసలు యజమానులకు తెలియకుండానే కొత్త పత్రాలు సృష్టిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాటిని మార్కెట్ ధరకు 50శాతం లోపే విక్రయించి డబుల్ రిజిస్ట్రేషన్లకు శ్రీకారం చుడుతున్నారు. దీంతో పెట్టుబడిగా ఈ స్థలాలను కొన్ని సంవత్సరాల కిందట కొనుగొలు చేసిన వారు ఇప్పుడు కొత్త చిక్కులతో పరేషాన్ అవుతున్నారు.
కొందరైతే ఈ వివాదాల జోలికి పోవడం ఎందుకని డాక్యుమెంట్లను ఎంతో కొంతకు విక్రయించుకుంటున్నారు. ఇలా పత్రాలు తయారు చేసిన వారు కూడా దౌర్జన్యానికి దిగి మీరు కొన్న రేటు కంటే డబుల్, త్రిబుల్ ఇస్తాము. లేదంటే మీరు న్యాయ పోరాటం చేసుకోండంటూ బెదిరిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై రాచకొండ స్పెషల్ అపరేషన్ టీం విచారణ చేసి రెండు ముఠాలను అరెస్టు చేసింది.
విమానాశ్రయంలో మృతదేహం….
కీసర మండలం రాంపల్లి గ్రామంలోని సర్వే నెంబరు 354, 355, 356, 357లో శాయన్న సాయిబాబుకు 1214 గజాల స్థలం ఉంది. శాయన్న సాయిబాబు కుటుంబం దక్షిణాఫ్రికాలో స్థిరపడింది. కొన్ని నెలల కిందట సాయిబాబు మరణించాడు. అంత్యక్రియలు నగరంలో నిర్వహించేందుకు సాయిబాబు భార్య బంధువైన శాయన్న బాలాజీ సాయికుమార్కు విమానాశ్రయంలో మృతదేహాన్ని స్వాధీనం చేసుకునేందుకు వాట్సాప్లో ధృవీకరణ పత్రాలను పంపించింది. సంప్రదాయ కార్యక్రమాలు పూర్తి చేసుకుని సాయిబాబు కుటుంబం దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయింది. ఈ సమయంలోనే శాయన్న బాలాజీ సాయికుమార్ మృతదేహం స్వాధీనం సమయంలో సేకరించుకున్న పత్రాలను జిరాక్స్లు తీసి వాటి ద్వారా లాస్ట్ ఆఫ్ సర్టిఫికెట్ కింద దరఖాస్తు చేశాడు. ముందుగా మేడ్చల్ పోలీసుస్టేషన్ పరిధిలో పోయాయని పేర్కొనడంతో పోలీసులు దీనిని తిరస్కరించారు.
ఆ తర్వాత మెదక్ జిల్లా మనోహరాబాద్ పీఎస్ పరిధిలో నమోదు చేసుకుని లాస్ట్ సర్టిఫికెట్ పొందాడు. వాటి ద్వారా సీసీ కాపీలను తీశాడు. అలా 6 కోట్ల భూమిని సగం ధరకే విక్రయించేందుకు శాయన్న బాలాజీ సాయికుమార్, కాంగ్రెసు పార్టీ నాయకుడు వంగేటి సంజీవరెడ్డితో కలిసి పన్నాగం పన్నాడు. దక్షిణాఫ్రికాలో ఉన్న అసలు యజమాని సాయిబాబు భార్య పేరుతో ఓ మహిళను తీసుకువచ్చారు. ఆమెకు ఉన్న ఆధార్ కార్డు మీద సాయిబాబు భార్య పేరును జోడించి కొత్తగా ఆధార్ కార్డును తయారు చేశారు. దాని ద్వారా 1215 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే ఈ వ్యవహరంపై సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నాలుగు రోజుల కిందట 8 మందిని అరెస్టు చేశారు. దీని కోసం నకిలీగా ముందుకు వచ్చిన మహిళకు దాదాపు 2 లక్షలకు పైగా చెల్లించినట్లు సమాచారం.
80 ఏండ్ల వృద్ధుడికి లక్ష…
చర్లపల్లి సర్వే నెం. 216, 217, 218, 219, 220, 221లో ఓ 226 గజాల స్థలం చాలా రోజులుగా ఖాళీగా ఉంది. ఈ నేపధ్యంలో ఓ ముఠా ఈ స్థలం యజమానుల గురించి ఆరా తీసింది. 10 ఏండ్లుగా ఎవరూ అక్కడికి రావడం లేదని తెలుసుకుని సీసీ కాపీని తీశారు. అందులో ఈ స్థలం కొనుగొలు చేసిన వ్యక్తి వయస్సు 50 ఏండ్లు ఉంది. అంటే ఇప్పటికి 22 ఏండ్లు దాటింది. యజమాని వయస్సు 72 ఉంటుందని అంచనా వేసుకుని ముఠా ఓ 80 ఏండ్ల వయస్సు ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి అతనికి లక్ష రూపాయాలు చెల్లించి నకిలీ పత్రాలను రూపొందించి రిజిస్ట్రేషన్ చేసుకుని దానిని 40 లక్షలకు మరొకరికి అమ్మేశారు. ఈ వ్యవహరం బయటపడడంతో రాచకొండ ఎస్వోటీ పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు.
నకిలీ పత్రాలు సృష్టిస్తే కఠిన చర్యలు ..
నకిలీ పత్రాలు సృష్టించి, అసలు యజమానుల స్థానంలో మరొకరితో రిజిస్ట్రేషన్లు చేస్తే అది క్రిమినల్ కేసు అవుతుంది. అలాంటి వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయి. ఈ సెక్షన్ల కింద నమోదైన అభియోగాల కింద 3 ఏండ్ల నుంచి 7 ఏండ్లకు పైగా శిక్షలు పడే అవకాశం ఉంది. స్థల యజమానులు ఎవరైనా వారి స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలు ఉన్నట్లు గుర్తించినా, వారి స్థానంలో మరొకరు రిజిస్ట్రేషన్ చేసినట్లు పసిగట్టినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. మీకు స్థలం ఉంటే మాత్రం దానికి ప్రహరీ, ఇతర అనుమతులను తీసుకుని పెట్టుకోవడం సురక్షితం. నిత్యం ఆన్లైన్ ద్వారా ఈసీలను చెక్ చేసుకోవడం సేఫ్.