గాజులరామారం, మే 16 : నిద్ర మత్తులో ఉన్న ఓ యువకుడు భవనం మూడో అంతస్తు పైనుంచి కింద పడి మృతిచెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జగద్గిరిగుట్ట రాజీవ్గృహకల్పలోని బ్లాక్ 24 రూమ్ నంబర్ 25లో నివాసముండే బండమీది గోపి (25) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు.
ఆదివారం ఏడుపాయల జాతరకు వెళ్లి రాత్రి తిరిగి ఇంటికి వచ్చి భవనంపై 3వ అంతస్తులో నిద్రపోయాడు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో మూత్ర విసర్జన కోసం నిద్రలేచిన గోపి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.