వనస్థలిపురం, మే 16 : ఏ తప్పు చేయకున్నా మీడియాలో, యూ ట్యూబ్లో వచ్చిన వార్తలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించానని ఓ బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్కుమార్ అన్నారు. గత వారం రూ.22.53లక్షలతో వనస్థలిపురంలోని ఓ బ్యాంక్ క్యాషియర్ ప్రవీణ్కుమార్ పారిపోయాడని మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. అయితే సోమవారం ప్రవీణ్ హయత్నగర్ కోర్టులో ప్రత్యక్షమయ్యాడు. లాయర్తో వచ్చి కోర్టులో లొంగిపోవడంతో కోర్టు ఈ నెల 30వరకు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ తాను గోవాకు, ఇతర ప్రాంతాలకు వెళ్లలేదని తెలిపాడు. చిట్యాల్లో బైక్ పెట్టి అక్కడి నుంచి నల్గొండ, దేవరకొండకు వెళ్లి చివరికి బెంగళూరుకు వెళ్లానన్నాడు. ఆత్మహత్యకు యత్నించినట్లు మణికట్టుపై కోసిన గుర్తులను చూపించాడు. తన నిజాయితీని నిరూపించుకునేందుకు తిరిగి వచ్చానని చెప్పాడు. కాగా బ్యాంక్లో జాతీయ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయని, లాకర్లకి పెట్టాల్సిన కెమెరాలు పక్కకు పెడుతున్నారని పేర్కొన్నాడు. వాటన్నింటిని సాక్ష్యాధారాలతో సహా బయటపెడుతానని తెలిపాడు.