తెలుగు యూనివర్సిటీ, మే 16: సమకాలీన, సామాజిక అంశాలను జోడిస్తూ మానవ జాతికి మార్గ నిర్దేశకత్వం చేసే దివ్య సందేశాల సంకలనం ‘సనూతన స్ఫూర్తి’ గ్రంథమని విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఏ.రామలింగేశ్వర రావు అన్నారు. స్ఫూర్తి కుటుంబం తెలంగాణ ట్రస్టు ఆధ్వర్యంలో గురు విశ్వస్ఫూర్తి విరచిత గ్రంథం ‘సనూతన స్ఫూర్తి’ ఆవిష్కరణ సభ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఆడిటోరియంలో సోమవారం ఘనంగా జరిగింది. మానవతో రక్షిత రక్షితః అన్న నినాదం ఎంతో ఆకట్టుకుందని జస్టిస్ రామలింగేశ్వరరావు అన్నారు. మానవ జాతిని రక్షించేది మానవత్వమని అన్నారు. ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ సమాజంలో ఆత్మీయత స్థాపించబడాలని, దశాబ్థాలుగా గురు విశ్వస్ఫూర్తి కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రముఖ రచయిత్రి ముక్తేవి భారతి మాట్లాడుతూ మనిషి జీవితానికి మనసే మూలం అన్నారు. మనసును నియంత్రణలో ఉంచుకుంటే జీవితం సాఫీగా సాగుతుందని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయులు, రచయిత్రి డాక్టర్ వైజయంతి మాట్లాడుతూ మానవ జాతిని ఉద్దేశించి సందేశాత్మకంగా ‘సనూతిన స్ఫూర్తి’ గ్రంథం ఉందన్నారు. ఓయూ తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ సాగి కమలాకర శర్మ గురువు విశిష్టతపై ప్రసంగిస్తూ ‘దండించేవాడే వాడు కాదు.. తండ్రిలాగ ఆదరించి మార్గనిర్దేశం చేసేవాడు గురువు’ వివరించారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి కుటుంబం మేనేజింగ్ ట్రస్టీ కేవీఎన్ రెడ్డి పాల్గొన్నారు.