సిటీబ్యూరో,మే 14 (నమస్తేతెలంగాణ) ;‘కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సీఎం కేసీఆర్ నగరానికి పెద్ద బహుమతి ఇచ్చారు. 15 టీఎంసీల సామర్థ్యంతో కొండపోచమ్మసాగర్, 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్ జలాశయాలను నిర్మించారు. మొత్తం 65 టీఎంసీల నీటికుండను భాగ్యనగరం నెత్తిన పెట్టుకున్నాం. కొండపోచమ్మ నుంచి ఒక పైపులైన్, సుంకిశాల నుంచి ఇంకో పైపులైన్ నిర్మిస్తున్నాం. రెండూ పూర్తయితే వరుసగా 5 ఏండ్లు కరువు వచ్చినా నగరానికి తాగునీటి కొరత ఉండదు. ఒకదాంట్లో సమస్య తలెత్తినా ఇంకో పైపులైన్ ద్వారా నీటినందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఔటర్ చుట్టూ రింగ్ మెయిన్ వ్యవస్థ పనులు ప్రారంభించాం. ప్రస్తుతం గ్రేటర్ తాగునీటి డిమాండ్ 37 టీఎంసీలు. వచ్చే 50 ఏండ్ల జనాభా అంచనా కలుపుకుంటే మరో 34 టీఎంసీలు అవసరం ఉంటుంది. నగర ఉజ్వల భవిష్యత్తే మాకు ముఖ్యం’ అని పురపాలక మంత్రి కేటీఆర్ అన్నారు. నగరానికి తాగునీటినందించే సుంకిశాల ఇన్టేక్ వెల్ నిర్మాణ పనులకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.
సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణంతో హైదరాబాద్ నగరానికి భవిష్యత్లో కూడా నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బంది ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. కృష్ణా నది నుంచి నగరానికి నీటిని తరలించేందుకు నాగార్జున సాగర్ సమీపంలో రూ.1,450 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు నిర్మాణానికి శనివారం మంత్రి కేటీఆర్ మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ , జగదీశ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్తో కలిసి శంకుస్థాపన చేశారు. వచ్చే ఎండాకాలం నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నట్లు కేటీఆర్ తెలిపారు. 50 ఏండ్ల ముందుచూపుతో సుంకిశాల ప్రాజెక్టును చేపట్టామని, ఇది పూర్తయితే వరుసగా ఐదేండ్లు కరువు పరిస్థితులు ఏర్పడినా.. నగరానికి తాగునీటికి ఢోకా ఉండదని చెప్పారు.
కృష్ణా ఫేజ్ 4, 5..
దాదాపు నగరం 100 కి.మీ మేర విస్తరించనున్నదని, రూ.1450 కోట్ల నిధులతో పంపులు, మోటార్లు అదనంగా 16.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేయడానికి పనులు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. భవిష్యత్తులో కృష్ణా ఫేజ్-4, ఫేజ్-5 ఈ రెండింటి కోసం కూడా పనులు ఇప్పుడే చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్లో ఫేజ్-4, 5 తీసుకోవాలంటే వనరుల లభ్యతను బట్టి కేవలం మోటార్లు పెట్టుకొని పైప్లైన్ వేసుకుంటే.. సరిపోతుందని, ముందుచూపుతో సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు పనులు చేపడుతున్నామన్నారు.
కొండపోచమ్మ నుంచి..
కొండపోచమ్మ నుంచి ఘన్పూర్, శామీర్పేట వరకు ఒక నీటి పైపు లైన్ వేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్డు చుట్టూ రింగ్మెయిన్ కూడా వేయాలని అనుకుంటున్నామన్నారు. ఇప్పటికే 48 కిలోమీటర్ల మేర పూర్తి చేశామని, మిగతా 110 కిలోమీటర్లు కూడా వేసుకుంటే..ఏ మారుమూల ప్రాంతానికైనా నీళ్లందించే సౌలభ్యం మనకు ఉంటుందన్నారు.
2072 నాటికి..
ప్రస్తుతం నగరానికి 37 టీఎంసీల నీరు అవసరం ఉంటే.. 2072 సంవత్సరం నాటికి 71 టీఎంసీల నీరు అవసరమవుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 2035 నాటికి 47.76 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు , 2065 నాటికి 67.71టీఎంసీలు, 2072 నాటికి 70.97 అంటే దాదాపు 71 టీఎంసీల నీటి అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. ముందుచూపుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సుంకిశాలలో రూ.1450 కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేపట్టారని వివరించారు. కేవలం తాగునీటి కోసమే కాదు పారిశ్రామిక అవసరాలకు కూడానీటిని వినియోగించుకుంటామని కేటీఆర్ వివరించారు.
చాలా అద్భుతంగా బుద్ధవనం
బుద్ధవనం ప్రాజెక్టు ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. సుంకిశాలతో పాటు బుద్ధవనంపై హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించిన ప్రజాప్రతినిధులను ఇక్కడికి ఆహ్వానించి ప్రభుత్వం చేపట్టిన పనులను వివరించి.. ఎంత శ్రద్ధతో భవిష్యత్ కోసం ఈ కార్యక్రమం చేపట్టిందో తెలియజేయాలన్నారు.
65 టీఎంసీలు..
సుంకిశాలను కృష్ణానదిపై, గోదావరిపై 10 టీఎంసీల మేర రామగుండం వద్ద ప్రాజెక్టు కట్టుకున్నామని, కాళేశ్వరం వల్ల హైదరాబాద్తో పాటు మరో 150 కిలోమీటర్ల పరిధిలో రీజినల్ రింగ్రోడ్డుతో సహా ఎంత విస్తరించినా నీటికి ఢోకా ఉండదన్నారు. కాళేశ్వరంలో కట్టుకున్న రిజర్వాయర్ల వల్ల 82 మీటర్ల ఎత్తున్న ఉండే మేడిగడ్డ నుంచి నీటిని పట్టుకొని 618 మీటర్ల ఎత్తున ఉండే కొండపోచమ్మ సాగర్ వద్దకు తీసుకొచ్చి.. 15 టీఎంసీల రిజర్వాయర్ కట్టుకున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. దీనికి కొద్దిగా కింద 50 టీఎంసీల మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మించామని, హైదరాబాద్ నెత్తిన 65 టీఎంసీల నీటికుండ ఉండేలా తీర్చిదిద్దామని చెప్పారు.
సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా 50 ఏండ్ల వరకు కూడా నీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. నగరానికి నీటి కొరత తీర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు.
ఆరు వేల కోట్ల పనులు జలమండలి ఎండీ దానకిశోర్
ప్రతి ఏడాది వేసవిలో నగరానికి కృష్ణా నీటిని తరలించేందుకు ఎమర్జెన్సీ పంపింగ్ చేయాల్సి వచ్చేదని, ఇందుకు ఏటా ఐదారు కోట్లు ఖర్చయ్యేదని జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. సుంకిశాల ప్రాజెక్టు ద్వారా ఈ అవసరం ఉండదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలమండలి దాదాపు రూ.6 వేల కోట్ల పనులను ఏక కాలంలో చేపడుతోందని ఎండీ దానకిశోర్ వివరించారు.
ఏడాదిలోపు పూర్తి
రూ.1450 కోట్లతో సుంకిశాల ఇన్టేక్ వెల్ నిర్మాణం, పైపులైన్లు ఏర్పాటు చేస్తాం. 16.5 టీఎంసీల తాగునీటిని నగరానికి తరలిస్తాం. వచ్చే ఎండాకాలంలోపు నిర్మాణం పూర్తవుతుంది. పారిశ్రామిక అవసరాలకూ నీటిని వినియోగించుకుంటాం.