బంజారాహిల్స్, జనవరి 18: ఫ్రంట్లైన్ వారియర్లపై కరోనా పంజా విసురుతోంది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని పలు బస్తీలు, కాలనీల్లో ఇప్పటికే పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. రెండు మూడు రోజులుగా ఫ్రంట్లైన్ వారియర్స్లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం ఐదు కేంద్రాల్లో మొత్తం 766 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, వారిలో 172 మందికి పాజిటివ్గా తేలింది. అత్యధికంగా బంజారాహిల్స్ రోడ్ నం- 3లోని షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అత్యధికంగా 41 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పంజాగుట్ట బస్తీ దవాఖానలో నిర్వహించిన పరీక్షల్లో 30 కేసులు నమోదయ్యాయి. కాగా పలు ప్రాంతాల్లో వైద్య సిబ్బంది, పోలీసులు కూడా కరోనా బారినపడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందిరానగర్లోని జూబ్లీహిల్స్ పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి అమీర్తో పాటు మరో ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలడంతో వారిని హోమ్ క్యారంటైన్లో ఉంచారు. బంజారాహిల్స్ రోడ్ నం-3లోని షౌకత్నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్గా తేలింది. ఫిలింనగర్ అర్బన్ హెల్త్ సెంటర్లో వైద్యాధికారితో పాటు మరో ముగ్గురు కరోనా బారిన పడగా, బంజారాహిల్స్ పీఎస్లో పనిచేస్తున్న ఐదుగురు కానిస్టేబుల్స్ కరోనా బారిన పడ్డారు. చింతల్బస్తీ ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న మరో నలుగురు సిబ్బందికి కరోనా సోకడంతో రోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వెస్ట్జోన్ అదనపు డీసీపీ సిద్దిఖీకి పాజటివ్ రావడంతో హోమ్ ఐసొలేషన్లోకి వెళ్లారు.