మాదాపూర్, మే 14: హైదరాబాద్ నగరం దినదినం అభివృద్ధి చెందుతున్నదని, ఇది అన్ని విధాల పలు రంగాలకు అనుకూలమని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో శనివారం ఏర్పాటు చేసిన ఐఐఏ (ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్) ఉత్సవ్కు మంత్రి కేటీఆర్ విచ్చేసి ఐఐఏ తెలంగాణ చాప్టర్ ఉదయ శంకర్ దోని, ఐఐఏ నాట్కాన్-21 కన్వీనర్ శ్రీధర్ గోపిశెట్టిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని, హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరు జీవించేందుకు అనుకూలంగా ఉందని అన్నారు.
టీఎస్ బీ పాస్లో దరఖాస్తులు చేసుకున్నట్లయితే కేవలం 21 రోజుల్లో పూర్తి అనుమతులు వస్తున్నాయని, గతంలో లాగా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవడంతో ఎటువంటి మోసాలకు చోటు లేకుండా సులభంగా ఉంటుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో అండర్ పాస్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పట్టిందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని నూతన ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకువచ్చి హైదరాబాద్ కీర్తిని మరింత పెంచనున్నట్లు తెలిపారు. ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్న రామప్ప దేవాలయం నుంచి ప్రారంభించి, తెలంగాణలో ఉన్న రాజవంశ పాలకుల వరకు హైదరాబాద్కే కాకుండా దక్కన్ ప్రాంతానికి కూడా భిన్నమైన గుర్తింపును అందించినట్లు తెలిపారు.
హైదరాబాద్ మహా నగరం ఒకప్పుడు రాజ భవనాలు, ఉద్యాన వనాలతో కూడి ఉండేదని, నగరంలో నిర్మాణమై ఉన్న ప్రతి ప్యాలెస్కు గుర్తింపు ఉందని తెలిపారు. చారిత్రక గోల్కొండ కోట నుంచి ఫలక్నుమా ఫ్యాలెస్ వరకు నిర్మాణ రూపాలు ఎంతో ఆకర్శణీయంగా ఉంటాయని మరో మారు తెలిపారు. చార్మినార్, మైండ్ స్పేస్లో ఏర్పాటు చేసిన బ్రిడ్జి, దుర్గం చెరువు వద్ద ఏర్పాటు చేసిన కేబుల్ బ్రిడ్జిలు తెలంగాణ గొప్పతనాన్ని చాటే విధంగా ఉన్నాయన్నారు. టీఎస్ ఐ పాస్, టీఎస్ బీ పాస్లు ఎంతో విజయవంతంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అనంతరం, పలువురు ఆర్కిటెక్ట్లకు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డ్లను అందజేశారు.