సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : బ్రాండెడ్ జీన్స్లు.. ైస్టెలిష్ షర్టులు, కండ్ల అద్దాలు..షూస్ ఇలా క్లాసీ లుక్తో ఏటీఎం కేంద్రాల వద్ద నిల్చుంటాడు.. అక్కడికి వచ్చే కస్టమర్ల వస్త్రధారణను నిశితంగా పరిశీలిస్తాడు..వారి బ్యాంక్ బ్యాలెన్స్పై ఒక అంచనాకు వస్తాడు. రిచ్గా కనిపించే వారితో మాటలు కలిపి.. కార్డులు మార్చేసి.. డబ్బు లు తస్కరిస్తాడు.. ఇది ఓ పాతనేరస్తుడి దోపిడీ ైస్టెల్. 50 ఏండ్లుపై బడిన వారినే టార్గెట్ చేస్తున్న ఈ మోస్ట్ వాంటె డ్ కోసం సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
చదివింది ఏడో తరగతే..
సూర్యాపేట జిల్లాకు చెందిన ఈ పాత నేరస్తుడి పేరు వెంకటేశ్. చదివింది ఏడో తరగతి. కానీ డ్రెస్సింగ్ ైస్టెల్ చూసి.. ఏటీఎం కేంద్రాల వద్దకు వచ్చే వారి డెబిట్ కార్డు బ్యాలెన్స్ను అంచనా వేయగలుగుతాడు.. అలా వారు లోపలికి వెళ్లాగానే తానూ ఫా లో అవుతాడు. సాధారణంగా ఏటీఎం కేం ద్రాల్లో డబ్బు తీసుకున్న తర్వాత రశీదుల ను తీసుకోరు. ఈ అంశంపైనే అతడు వినియోగదారుడితో మాటలు కలిపి ‘సార్ కచ్చితంగా మీరు నగదు విత్డ్రా చేసుకున్న తర్వాత రశీదు తీసుకోండి.. లేదంటే ఈ మధ్య నగదు విత్డ్రా చేసిన దానికంటే అధికంగా వస్తున్నాయ్’ అంటూ చెబుతాడు. బాధితుడు నగదు విత్డ్రా చేశాక.. మాటల్లో పెట్టి.. రశీదు వచ్చే సమయంలో యంత్రంపై నో బటన్ నొక్కుతాడు.‘రశీదు రావాట్లేదా.. ఒకసారి కార్డు ఇవ్వండి.. నేను చూస్తాన’ని చెప్పి.. పిన్ నంబర్ తెలుసుకొని.. రశీదుతో పాటు.. వినియోగదారుడి కార్డు స్థానంలో తన వద్ద ఉన్న కార్డును ఇచ్చేస్తాడు.
పెట్రోల్ బంక్కు వెళ్లి..
వినియోగదారుడి దగ్గర కాజేసిన కార్డును తీసుకెళ్లి.. పెట్రోల్ బంక్ల్లో కమీషన్ను చెల్లించి కార్డును స్వైప్ చేసి.. అందులో ఉన్న మొత్తం నగదును డ్రా చేస్తాడు. వాటితో జల్సా చేస్తాడు. ఖాళీ చేసిన కార్డును మరో వినియోగదారుడిని టార్గెట్ చేసి.. తారుమారు చేసేస్తాడు. ఇలా వెంకటేశ్ రెండేండ్ల నుంచి దాదాపు 100 మందిని బురిడీ కొట్టించినట్లు వెలుగులోకి వచ్చింది. గతంలో హైదరాబాద్ పోలీసులతో పాటు పలు జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది. వెంకటేశ్ సుమారు రూ.10 లక్షలకు పైగా కొట్టేసి ఉంటాడని భావిస్తున్నారు.