సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ): తాగునీటి సరఫరా వ్యవస్థను సమూలంగా ఆధునీకరించి హైదరాబాద్లో నీటి ఎద్దడి అన్నదే లేకుండా చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందుకు కొనసాగింపుగా మరో బృహత్తర కార్యం చేపట్టింది. రాబోయే వందేళ్ల వరకు మండుటెండల్లోనూ నీటి కొరత రానీయకుండా నాగార్జున సాగర్ రిజర్వాయర్ వద్ద భారీ ఇన్టేక్ వెల్ నిర్మించనున్నది. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలంలోని సుంకిశాల వద్ద 1450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుతో నగరానికి నీటి ఇబ్బందులు శాశ్వతంగా తప్పనున్నాయి. ఈ నేపథ్యంలోనే నగర మంత్రులు మహమూద్ ఆలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. 2023 జూన్ కల్లా దీన్ని పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యం పెట్టుకున్నారు.
ఎందుకీ సుంకిశాల?
నగరంలో మొత్తం 12.56 లక్షల మంచినీటి కనెక్షన్లు ఉన్నాయి. కోటి మందికి పైగా జనాభా ఉంది. దాదాపు 30 టీఎంసీల వరకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఏడాది పొడవునా ఇటు కృష్ణా నది నుంచి 16.5 టీఎంసీలు, అటు గోదావరి నుంచి 10 టీఎంసీలు సింగూరు, మంజీర నుంచి 3 నుంచి 4 టీఎంసీల వరకు నీళ్లు తరలిస్తున్నారు. ప్రతిరోజూ 50 కోట్ల గ్యాలన్ల మంచినీటిని హైదరాబాద్ జలమండలి సరఫరా చేస్తున్నది. అయితే హైదరాబాద్ నగర పరిధి జీహెచ్ఎంసీ నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించడంతో అందుకు అనుగుణంగా తాగునీటి అవసరాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రిజర్వాయరు వెనక భాగంలో సుంకిశాల వద్ద భారీ ఇన్టెక్ వెల్ నిర్మించనున్నారు. నాగార్జునసాగర్లో జలాశయ నీటినిల్వలు కనీసస్థాయికి దిగజారినా సరే.. సంవత్సరం పొడవునా హైదరాబాద్కు పుష్కలంగా నీటిని సరఫరా చేయవచ్చు.
సాగర్.. 462 అడుగులకు పడిపోయినా..
నగరానికి తాగునీరు సరఫరా చేసేందుకు ప్రధాన వనరు నాగార్జున సాగర్ రిజర్వాయరు. అయితే వేసవి రాగానే సాగర్లో కూడా నీటిమట్టాలు పడిపోతూ ఉం టాయి. నీటి మట్టం 510 అడుగుల స్థాయిలో ఉంటేనే నిర్ణీత ప్రమాణంలో నీళ్లు తీసుకోవడం సాధ్యపడుతుం ది. అంతకన్నా నీటిస్థాయి పడిపోతే సాగర్ ఫోర్ షోర్ లోని పుట్టంగండి వద్ద అత్యవసర మోటార్లను ఏర్పాటు చేసి నీటిని అందిస్తూ ఉంటారు. అయితే సుంకిశాల ఇన్టెక్ వెల్తో ఇప్పుడు ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. నాగార్జున సాగర్ జలాశయ నిల్వలు డెడ్స్టోరేజీ స్థాయి 462 అడుగులకు (పూర్తి సామర్థ్యం 590 అడుగులు) పడిపోయినా, 63 టీఎంసీలకు (పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు) దిగజారినా ఏ ఆటంకమూ లేకుండా నగరానికి నీటిని సరఫరా చేయొచ్చు.
శాశ్వత సదుపాయం
ఒక్కో దశలో 9 కోట్ల గ్యాలన్ల చొప్పున మొత్తం 3 దశల్లో రోజుకు 27 కోట్ల గ్యాలన్ల నీటిని ప్రస్తుతం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) కెనాల్ నుంచి నగరానికి పంపింగ్ చేస్తున్నారు. సాగునీటి తరలింపు కోసం ఉద్దేశించిన ఈ కాల్వ ద్వారా నగరానికి నీళ్లందించేలా ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. పైగా అటు సాగునీరు, ఇటు నగరానికి మంచినీళ్లు ఏకకాలంలో సరఫరా చేయాలంటే వేసవిలో చాలా ఆటంకాలు తలెత్తుతున్నాయి. ఏఎంఆర్పీ కాల్వ నుంచి నీటిని సేకరించడానికి అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లో ఎప్పుడూ సరిపడా నీరు ఉండాలి. ఒకవేళ సాగర్ లో నీరు 510 అడుగుల కంటే దిగువకు చేరితే అకంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏఎంఆర్పీ కాల్వకు నీరందదు. ఈ పరిస్థితుల్లో రిజర్వాయర్ నుంచి పంపింగ్ చేసి ఏఎంఆర్పీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు నీటిని తరలించాల్సి ఉంటుంది. సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే ఇలా తాతాలికంగా పంపింగ్ చేయాల్సిన సమస్య ఉండదు.
గంటకు 12 ఎంజీడీలు
సుంకిశాల ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గంటకు 1.2 కోట్ల గ్యాలన్ల నీటిని తీసుకునే భారీ సామర్థ్యంతో ఇన్టేక్ వెల్ నిర్మాణం జరుగుతున్నది. భూగర్భంలో వెట్ వెల్, డ్రై వెల్ పనులు జరుగుతున్నాయి. షాఫ్ట్ నిర్మాణం కోసం 82 మీటర్ల లోతులో రాయి తొలగించాల్సి ఉండగా ఇప్పటికే 62 మీటర్ల పని పూర్తయ్యింది. 8 మీటర్ల వ్యాసంతో యాక్సెస్ టన్నెళ్లు, లింకు టన్నెళ్ల కోసం తవ్వకం పనులు ప్రారంభమయ్యాయి. ఇన్టేక్ టన్నెళ్లను కూడా తవ్వుతున్నారు. 17.2 కిలోమీటర్ల పొడవునా 2.375 మీటర్ల వ్యాసం కలిగిన పైపులైన్లు వేస్తున్నారు.
సీఎం కేసీఆర్ చొరవతోనే..
వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో, ప్రతి వేసవిలో నాగార్జున సాగర్లో నీరు ఇంకిపోతూ ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు తాగునీరు అందించాలంటే కష్టమయ్యేది. పుట్టంగండి హెడ్ రెగ్యులేటర్ నుంచి దాదాపు కిలోమీటర్ లోపలికి వెళ్లి అక్కడి నుంచి పెద్ద పైపుల ద్వారా నీటిని తోడి ఎమర్జెన్సీ పంపింగ్ ద్వారా నగరానికి నీటి సరఫరా చేయడం జలమండలికి ఓ పెద్ద సవాల్గా ఉండేది. ఈ సమస్యకు ప్రభుత్వం చక్కటి పరిష్కారం ఆలోచించింది. అన్ని కాలాల్లోనూ నగర ప్రజల తాగునీటిని ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్ డేడ్స్టోరేజీ నుంచి కూడా నీటిని తీసుకునేలా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని సుంకిశాల ఇన్టేక్ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చారు.
– దానకిశోర్, మేనేజింగ్ డైరెక్టర్ ,జలమండలి