మియాపూర్, జనవరి 17 : ప్రజల సౌకర్యం కోసం చేపట్టే పనులలో జాప్యం చేసే గుత్తేదారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. ఇదే సమయంలో వారికి కేటాయించబడ్డ పనులను సకాలంలో పని చేస్తున్న గుత్తేదారులకు కేటాయించాలన్నారు. శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్పేట్, చందానగర్, మియాపూర్, భారతీనగర్ డివిజన్లలో చేపట్ట వలసిన అభివృద్ధి పనులపై ఇటీవల మంత్రి కేటీఆర్ చేపట్టిన సమీక్షకు కొనసాగింపుగా విప్ గాంధీ జోనల్ కమిషనర్ అల ప్రియాంక, కార్పొరేటర్లు, ఆయా విభాగాల అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధిలో అధికారులు గుత్తేదారులు భాగస్వాములు కావాలని, సకాలంలో పనులు పూర్తయ్యేలా అధికారులు సమీక్షించాలని పేర్కొన్నారు. పాదయాత్రల ద్వారా కాలనీల్లో సమస్యలు గుర్తించి పరిష్కారానికి జీహెచ్ఎంసీ నిధులను మంజూరు చేయిస్తున్నా.. సంబంధిత పనులు పూర్తి చేయడంలో గుత్తేదారుల నిర్లక్ష్యం ఏమాత్రం సరికాదని, దానిద్వారా లక్ష్యం నెరవేరదని విప్ గాంధీ పేర్కొన్నారు. కాగా విప్ గాంధీ సమీక్షతో స్పందించిన గుత్తేదారులు సకాలంలో పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అనంతరం ఎస్టీపీలు, చెరువుల అభివృద్ధి, శ్మశాన వాటికల అభివృద్ధి, యూజీడీ విస్తరింపు సహా పలు అంశాలపై అధికారులతో ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు తమ డివిజన్లలో దత్తత తీసుకోనున్న చెరువుల వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు హమీద్ పటేల్, రాగం నాగేందర్యాదవ్, జగదీశ్వర్ గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్రెడ్డి, సింధురెడ్డి, డీసీ వెంకన్న, ఎస్ఈ శంకర్నాయక్ , ఈఈలు శ్రీకాంతి, శ్రీనివాస్, సీపీ నర్సింహరాములు, ఏసీపీ మెహ్రో తదితరులు పాల్గొన్నారు.