దుండిగల్, మే12 :బాచుపల్లి సీఐ నర్సింహరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…వరంగల్ జిల్లా, శాయంపేట మండలం, నేరేడుపల్లికి లలిత, కృష్ణమూర్తి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. 12 ఏండ్ల క్రితమే కృష్ణమూర్తి కుటుంబానికి దూరమయ్యాడు. ఇద్దరు ఆడపిల్లలకు వివాహం కాగా, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన కొడుకు శ్రీకర్తో కలిసి తల్లి నిజాంపేట్ వినాయకనగర్, రోడ్డు నెంబర్ 1లోని గ్రేటర్ ఇన్ఫ్రాస్ జువేల్గ్రాండ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నది. నాలుగేండ్ల క్రితం చిన్న కుమార్తె దివ్య(36)కు ప్రైవేటు కంపెనీలో పని చేసే సుమన్తో వివాహం అయింది. ఆమె కేపీహెచ్బీ కాలనీలో భర్త, కుమారుడు శివకార్తికేయ(18 నెలలు)తో కలిసి ఉంటోంది.
తండ్రిపై అయిష్టతతోనే…
దివ్య పెండ్లి సమయంలో తండ్రితో కన్యాదానం చేయించేందుకు శ్రీకర్ తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దీనిని తల్లీ బిడ్డలు వ్యతిరేకించారు. అప్పటి నుంచి శ్రీకర్కు తల్లి, చెల్లె మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. ఏనాటికైనా తండ్రీ కొడుకులు ఒక్కటవుతారని భావించిన తల్లీబిడ్డలు మానసికంగా కృంగిపోయారు. వేసవి సెలవుల్లో భాగంగా 15 రోజుల క్రితం దివ్య, తన కొడుకు శివకార్తికేయతో కలిసి పుట్టింటికి వచ్చింది. మరోసారి వారి మధ్య ఇవే ఆలోచనలు రావడంతో తమ సమస్యలకు చావే పరిష్కారం అనుకున్నారు. అయితే తాము మరణిస్తే శివకార్తికేయ అనాథ అవుతాడని భావించి, ముందుగా అతన్ని చంపాలని నిర్ణయించారు.
మనుమడికి ఉరివేసి..
ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో లలిత ముందుగా మనుమడికి చున్నీతో ఉరి వేసి హతమార్చింది. ఆపై తాను ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్మకు పాల్పడింది. వీరి తరువాత దివ్య చున్నీతో ఫ్యాన్కు ఉరి వేసుకోగా తెగిపోవడంతో కింద పడింది. కొన ఊపిరితో ఉన్న ఆమె ఇదే విషయాన్ని పక్క గదిలో ఉన్న అన్న శ్రీకర్కు తెలిపింది. వెంటనే అతను బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దివ్యను ఓ ప్రైవేటు దవాఖానకు తరలించారు. లలిత, శివకార్తికేయ మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఒంటరిగా దివ్య భర్త…
ఫార్మసీ కంపెనీ ఉద్యోగి అయిన దివ్య భర్త సుమన్ పరిస్థితి దీనంగా మారింది. ఓ వైపు కన్న కొడుకు మృతి చెందగా, మరో వైపు ఆసుపత్రిలో భార్య కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతోంది. అప్పటికే తల్లిదండ్రులు లేని అతను ప్రస్తుతం చోటు చేసుకున్న ఘటనతో తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. లలిత, దివ్య క్షణికావేశంలో చేసిన తప్పిదం… ఓ కుటుంబం మొతాన్ని చిన్నాభిన్నం చేసిందని స్థానికులు కంటి తడి పెట్టారు.