సిటీబ్యూరో, మే 11 (నమస్తే తెలంగాణ) : నగదు బ్యాగ్తో వెళ్తున్న వ్యక్తిని అటకాయించి రూ.50 లక్షలు దోపిడీ చేసిన కేసును సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు ఛేదించారు. బాధితుడి స్నేహితుడే ప్రధాన సూత్రధారి అని దర్యాప్తులో తేలింది. ఈ కేసు వివరాలను బుధవారం కమిషనర్ సీవీ ఆనంద్ విలేకరులకు తెలిపారు. రాజస్థాన్కు చెందిన జోగ్ సింగ్, కిమ్ రాజ్ పురోహిత్లు స్నేహితులు. ఇద్దరూ హైదరాబాద్కు వచ్చి బేగంబజార్లో వ్యాపారం చేస్తున్నారు. జోగ్సింగ్ హోల్సేల్ స్టీల్ వ్యాపారం చేస్తుండగా, కిమ్ రాజ్ పురోహిత్ తన సొంత ఆటో ట్రాలీతో ట్రాన్స్పోర్టు పనులు చేస్తున్నాడు. జోగిసింగ్ వ్యాపారం గురించి కిమ్ రాజ్కు పూర్తి అవగాహన ఉంది. ప్రతి రోజు లక్షలాది రూపాయలను తన దుకాణంలో పని చేసే మిట్టలాల్ ద్వారా ఇంటికి పంపిస్తుంటాడు.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కిమ్రాజ్ జోగ్సింగ్ డబ్బును కొట్టేయాలని ప్లాన్ చేశాడు. ఇందుకు హైదరాబాద్లో ఉంటున్న రాజస్థాన్కు చెందిన పాత నేరస్తులైన వికీరాజ్ పురోహిత్, మనోజ్ పన్వార్ను కలిసి దోపిడీ స్కెచ్ వివరించాడు. ఇందులో భాగంగా విష్ణుగోపాల్ వ్యాస్, టికమ్ చంద్ అలియాస్ బబ్లూ, మితేశ్ చౌదరిలను కూడా తమ గ్యాంగ్లో చేర్చుకున్నారు. మార్చి 16న రాత్రి 8 గంటల సమయంలో జోగ్సింగ్ రూ. 50 లక్షల బ్యాగ్ను ఇంట్లో పెట్టాలని మిట్ట లాల్ను పంపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఆ గ్యాంగ్ అతనిని వెంబడిస్తూ జోగ్సింగ్ ఇంటి సమీపంలోకి వెళ్లగానే రూ. 50 లక్షల బ్యాగ్ తీసుకొని పరారయ్యారు. అందులో కొంత నగదును తీసుకొని, మిగతావి మితేశ్ చౌదరి వద్ద భద్రపరిచారు.
ఈ ఘటనపై బాధితుడు అఫ్జల్గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేపట్టారు. సౌత్జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర బృందం ప్రధాన సూత్రధారి మినహా మిగతా దోపిడీ ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 28.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణను అఫ్జల్గంజ్ పోలీసులకు అప్పగించారు. పరారీలో ఉన్న కిమ్ రాజ్ పురోహిత్ కోసం గాలింపు చేపట్టారు. ఈ సమావేశంలో టాస్క్ఫోర్స్ డీసీపీ చక్రవర్తి గుమ్మి పాల్గొన్నారు.