సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): చాలా మంది ఉద్యోగ విరమణ అనంతరం ఏం చేస్తారు? కుటుంబ సభ్యులతో వారి మనవలు, మనవరాళ్లు, బంధువులు అంటూ కాలక్షేపం చేస్తుంటారు. కానీ సనత్నగర్లోని మోడల్కాలనీకి చెందిన ఐదుగురు అసోసియేషన్ సభ్యులు ఏడేండ్ల కిందట ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మానవ సేవే.. మాధవ సేవ అనే నినాదంతో మానవసేవ చారిటబుల్ ట్రస్టును ఏర్పాటు చేసి పేదల కడుపునింపి ఆకలి తీర్చుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుంటున్న కాలనీవాసులతో పాటు విదేశాల్లో స్థిరపడిన వారు సైతం తమ పుట్టినరోజు, పెండ్లిరోజు, కుటుం బ సభ్యుల జన్మదినం, ఇతర శుభకార్యాలేవైనా సరే.. పేదోడికి కాస్త ఆసరా చేకూరాల్సిందేనంటూ ముందుకుసాగుతున్నారు. వేసవిలోనైతే పెరుగన్నం, మజ్జిగతో పేదల కడుపునింపుతున్నారు.
ముందుకు వస్తున్న దాతలు..
మానవతాదృక్పథంతో చేపట్టే కార్యక్రమాలకు పలువురు దాతలు ముందుకు వస్తున్నట్లు సమితి నిర్వాహకులు తెలిపారు. ప్రత్యేకంగా దాతల పేర్లను నోటీసుబోర్డుపై రాసిపెడతారు. వారికి ఎస్ఎంఎస్ల రూపంలో కూడా అభినందనలు తెలుపుతారు. దీంతో ఈ కార్యక్రమానికి ఎంతో స్పందన వస్తున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.
తయారీ బాధ్యత వారిదే..
పంపిణీ చేసే పదార్థాల తయారీ బాధ్యత వాసిరెడ్డి స్వీట్ హౌస్ యాజమాన్యం స్వీకరించిందని, కొంత మొత్తాన్ని చెల్లిస్తే పదార్థాలు మొత్తం సిద్ధం చేసి పెడతారని తెలిపారు. దాతలు లేని రోజు సమితి నిర్వాహకులే విరాళాల నుంచి అన్నదాన కార్యక్రమానికి చెల్లిస్తారు. విరాళాలు, శిబిరాల నిర్వహణ, అన్నదాన సేవలను సభ్యులు దండ బుచ్చిబాబు, జేఎస్టీ సాయి, మాచారావు, శశికాంత్, రవీంద్రబాబు, శ్రీనివాసరావు పర్యవేక్షిస్తుంటారు.
మార్చి నుంచి జూన్ వరకు..
మార్చి నుంచి జూన్ వరకు ఈఎస్ఐ దవాఖాన సమీపంలోని మోడల్కాలనీ స్వాగత ద్వారం వద్ద నిత్యం 300 మంది పేదలకు అన్నదానం చేస్తున్నారు. చలివేంద్రంతో పాటు మిత ఆహారాన్ని అందజేస్తున్నారు. అంతేకాకుండా సనత్నగర్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వద్ద రోగుల సహాయకులకు సైతం ఆకలిని తీర్చుతూ ఎంతో భరోసాను కల్పిస్తున్నారు ‘మానవసేవ’ సమితి సభ్యులు.
80రోజుల్లో సుమారు 50వేల మందికి..
కాగా కొవిడ్ సమయంలోనూ ‘పేదలకు మాత్రమే ఇక్కడ భోజనం లభించును’ అనే నినాదంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. లాక్డౌన్ కారణంగా పనిలేక, పూట గడవక ఎంతో మంది ఆకలితో అలమటించిన విషయం తెలిసిందే. ఆ తరుణంలో నగరంలోని పలు ప్రాంతాల్లోని వలస, పేద కూలీలకు మానవసేవ ఆధ్వర్యంలో 80రోజుల్లో సుమారు 50వేల మంది ఆకలిని తీర్చారు. దీంతోపాటు నగరంలోని పలు అనాథ ఆశ్రమాలు, అంధుల పాఠశాలల్లోనూ ప్రత్యేక రోజుల్లో అన్నదానం, ప్రతిఏటా సనత్నగర్ చుట్టుపక్కల ప్రభుత్వ బడుల విద్యార్థులకు స్టేషనరీని అందజేస్తూ మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు.