సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): మన బస్తీ- మన బడి పథకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలోని 15 నియోజకవర్గాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి అన్ని స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తి చేసే విధంగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
స్కూళ్ల అభివృద్ధికి రూ.40 కోట్లు..
ప్రస్తుతం జిల్లాలో మొత్తం 279 ప్రభుత్వ పాఠశాలలు కొనసాగుతున్నాయి. వాటిలో 25 పాఠశాలలు మాత్రం ప్రైవేటు భవనాలలో కొనసాగుతున్నాయి. మిగిలిన 214 పాఠశాలల అభివృద్ధికి జిల్లా వ్యాప్తంగా మొత్తం రూ.40 కోట్లకు పైగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇందులో అన్ని రకాల ఉన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు తప్పనిసరిగా కిచెన్షెడ్ల నిర్మాణాలు చేపట్టబోతున్నారు. ఒక్కొక్క కిచెన్షెడ్ నిర్మాణానికి రూ.20 లక్షలు కేటాయించే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే మొత్తం 214 పాఠశాలల అభివృద్ధి పనులకు గరిష్టంగా రూ.30 లక్షల వరకు నిధులు కేటాయించారు. కొన్ని ప్రత్యేక అవసరాలు ఉన్న స్కూళ్లకు మాత్రం దాదాపు రూ.50 లక్షల వరకు కూడా ప్రతిపాదించినట్లు కలెక్టర్ ఎల్ శర్మన్ తెలిపారు. అయితే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు జూన్ నెలాఖరు వరకు పూర్తి చేయాలని సంబంధిత జిల్లా అధికారులకు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు.
రాజ్భవన్ స్కూల్లోమన బస్తీ-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యపై ప్రత్యేక శ్రద్ద పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు-మనబడి, మన బస్తీ-మనబడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, రాష్ట్రంలో మొదటి విడతలో 9123 పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.3,497 కోట్లు మంజూరు చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమాజిగూడలోని రాజ్భవన్ పాఠశాలలో మన బస్తీ-మనబడి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్, డీఈవో రోహిణి, డిప్యూటీ డీఈవో చిరంజీవి, హైస్కూల్, ప్రైమరీ పాఠశాలల ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ, మంజులత, ఇన్స్పెక్టర్స్ ఆఫ్ స్కూల్ శాంతాబాయితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. తొలుత పాఠశాలలోని టాయిలెట్స్, నీటి వ్యవస్థ మరమ్మతుల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలోని 15నియోజకవర్గాల పరిధిలో 690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 239 స్కూళ్లను ఎంపిక చేశామని చెప్పారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ రాజ్భవన్ స్కూల్లో అడ్మిషన్ల కోసం పోటీపడతారని, ఈ పాఠశాల ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉండటం గర్వకారణమన్నారు. త్వరలోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్కు బడ్జెట్ కేటాయించనున్నారని తెలిపారు. రాజ్భవన్ స్కూల్ విద్యార్థులు బాగా చదువుకొని దేశానికి, రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.
అమీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో..
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పం సిద్ధించే దిశగా అడుగులు పడుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. సోమవారం ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా అమీర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో రూ. 27 లక్షలతో చేపట్టాల్సిన నిర్మాణ పనులకు మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణీదేవి, అమీర్పేట్ కార్పొరేటర్ కేతినేని సరళ, మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డీఈవో రోహిణి, డిప్యూటీ ఈవో చిరంజీవి, పాఠశాల హెచ్ఎం బి.మధుసూదన్రావుతో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్ధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
అంబర్పేట పాఠశాలలకు రూ.2.77 కోట్లు
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంలో భాగంగా అంబర్పేట నియోజకవర్గంలోని ప్రభుత్వ బడుల అభివృద్ధికి రూ.2కోట్ల 77లక్షలు కేటాయించినట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సోమవారం అంబర్పేట డివిజన్ సీపీఎల్ పోలీస్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ సురభివాణిదేవి, స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్, డీఈవో రోహిణి, విద్యామండలి అధికారులు తదితరులతో కలసి ఆయన మన బస్తీ-మన బడి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ బాయ్స్ ఉన్నత పాఠశాలకు రూ.80 లక్షల నిధులు మంజూరు చేశామన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ విజ్ఞప్తి మేరకు ప్రస్తుతం ఉన్న 25 తరగతి గదులకు తోడు మరో రెండు అంతస్తులు నిర్మించి మరో 25 క్లాస్ రూమ్లను నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రస్తుతం పాఠశాలలో 900 విద్యార్థులు ఉండగా, 2000మంది విద్యనభ్యసించే విధంగా చర్యలు తీసుకొని నగరంలోనే ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యామండలి అధికారులు హసన్న, డిప్యూటీ ఈవో శ్రీధర్, డిప్యూటీ ఐవోఎస్ నిజాముద్దీన్, సర్వశిక్ష అభియాన్ ఏఈ శ్రీనివాస్, ప్రధానోపాద్యాయురాలు మాధురి, సదానందం, నాగరాజు, జావేద్, ఈశ్వర్, సరళ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు:ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దనున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. సోమవారం బోరబండ స్వరాజ్నగర్, సాయిబాబానగర్ ప్రాథమిక పాఠశాలల్లో ‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రూ.32 లక్షలతో సాయిబాబానగర్ ప్రాథమిక పాఠశాలలో, రూ.30 లక్షలతో స్వరాజ్నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రతిపాదిత అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ డీఈవో చిరంజీవి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్య:హోంమంత్రి మహమూద్ అలీ
ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే ధ్యేయంతో సీఎం కేసీఆర్ మన బస్తీ మన బడి కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. సోమవారం విజయనగర్కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ. 60లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్, డిప్యూటీ ఈవో బొంతుల వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సి సంజయ్, డివిజన్ అధ్యక్షుడు అభిషేక్రాజ్, ప్రిన్సిపాల్ శంకరయ్య, రాజు పాల్గొన్నారు.
జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో..
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పలు పనులను డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు పది ప్రభుత్వ పాఠశాలల్లో రూ.5 కోట్ల ఖర్చుతో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని తెలిపారు. సికింద్రాబాద్లో నూతనంగా జూనియర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. జామై ఉస్మానియా ప్రభుత్వ పాఠశాలలో రూ.18 లక్షల వ్యయంతో వివిధ పనులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో సామ్యూల్రాజ్, ఎంఈవో శ్రీనివాసరాజు, వివిధ శాఖల అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.