బంజారాహిల్స్, ఆగస్టు 12: నగరం నడిబొడ్డున సుమారు మూడువందల కోట్ల విలువైన స్థలాన్ని పట్టపగలే కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని పోలీస్ కమాండ్ కంట్రోల్కు సమీపంలో ఉన్న 2.14 ఎకరాల స్థలానికి సంబంధించి ఇటీవల పి.శేషుబాబు అనే వ్యక్తి కుటుంబానికి అనుకూలంగా కోర్టులో తీర్పు వచ్చింది. దీంతో శేషుబాబు కుమారుడు విక్రమ్ ఈ స్థలం చుట్టూ రక్షణ ఏర్పాటు చేయడంతో పాటు వాచ్మన్ను కూడా నియమించాడు.
గతంలో బోగస్ పత్రాలతో ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం సుమారు 12 మంది కత్తులు, కర్రలతో స్థలంలోకి ప్రవేశించారు. అక్కడున్న వాచ్మన్ను కత్తితో బెదిరించడంతో పాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేసి అక్కడే తిష్టవేశారు.
భయాందోళనకు గురైన వాచ్మన్ అక్కడి నుంచి బయటకు పరుగులు తీశాడు. ఈ విషయంపై యజమాని విక్రమ్కు సమాచారం ఇవ్వడంతో అతడి స్నేహితుడు హర్షా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు స్థలాన్ని ఆక్రమించుకున్న బర్కత్పురకు చెందిన అడవికొలను ఆదిత్యనారాయణ(28), కరీంనగర్కు చెందిన మహ్మద్ అబ్దుల్లా ఫైజల్ ఉజ్జయిర్(27), టోలీచౌకికి చెందిన ఎండీ. దానీశ్(24), లంగర్హౌజ్కు చెందిన సయ్యద్ అక్బర్(29), టోలీచౌకికి చెందిన సర్ఫరాజ్(26), మీర్ వికార్ అలీ(23), మలక్పేటకు చెందిన నిజామ్ మస్కతి(24), ఎండీ.సిమ్రాన్(20), కుర్మగూడకు చెందిన మీర్ ఖాజా అలీ(24)ని అదుపులోకి తీసుకున్నారు.
వారిని విచారించగా సుమారు 300 కోట్ల విలువైన స్థలాన్ని బోగస్ పత్రాలను చూపిస్తూ ఆక్రమించేందుకు యత్నించినట్లు తేలింది. దీంతో వీరందరిపై ఐపీసీ 427, 447, 452, 506, 342 రెడ్విత్ 34తో పాటు ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు, శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.