సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): సేల్ అగ్రిమెంట్ ప్రకారం నిర్ణీత సమయంలో కొనుగోలుదారుడికి ఫ్లాట్ నిర్మాణం చేసి ఇవ్వనందుకు శ్రీసాయి ప్రణవి హోమ్స్పై హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ.15లక్షల 49వేల 814లు కొనుగోలుదారుడికి చెల్లించాలని వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్న, ఎస్.మాధవితో కూడిన బెంచ్ ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. ఖైరతాబాద్కు చెందిన ఎన్.సతీశ్ ప్రైవేట్ ఉద్యోగి. 2015లో మేడ్చల్ జిల్లాలో రూ.15లక్షలకు ఫ్లాట్ కొనుగోలు కోసం శ్రీసాయి ప్రణవి హోమ్స్తో ఆగస్టు 26, 2015లో సేల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. కొనుగోలుదారుడు రూపాయలు మొత్తం చెల్లించగా రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వ నిబంధనలు, షరతుల ప్రకారం అక్టోబర్ 30, 2015 వరకు నిర్మాణం పూర్తి చేసి, కొనుగోలుదారుడికి ఫ్లాట్ అప్పగించాలి.
బాధితుడు పలుమార్లు సైట్ను సందర్శించి, నిర్మాణ పనులు పూర్తిచేయాలని సదరు సంస్థకు విజ్ఞప్తి చేశాడు. పూర్తి చేయడానికి స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్, వాటర్, సివిల్ తగాదాలు జాప్యానికి కారణమంటూ.. కొనుగోలుదారుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. దీంతో న్యాయం చేయాల్సిందిగా బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించాడు. కేసు పూర్వాపరాలను కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్న, ఎస్.మాధవితో కూడిన బెంచ్ పరిశీలించింది. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం.. ఇది తీవ్రమైన సేవాలోపంతో పాటు సంస్థ నిర్లక్ష్యం బయటపడిందని పేర్కొన్నది
అంతేగాకుండా.. ఫిర్యాదుదారుడికి ఆర్థికంగా నష్టం జరిగిందని, మానసికవేదనకు గురవడంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తాయని పేర్కొన్నది. శ్రీసాయి ప్రణవి హోమ్స్ వాదనల్లో పొంతనలేదని, బాధితుడికి రూ.15లక్షల 49వేల 814లు 12శాతం వడ్డీతో చెల్లించాలని, నష్టపరిహారంగా రూ.50 వేలు ఇవ్వాలని ఆదేశించింది. 30 రోజుల్లో ఉత్తర్వులను పాటించాలని, లేని పక్షంలో పరిహారం మినహా మొత్తానికి 8 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించారు.