సుల్తాన్బజార్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజియన్ ఆర్ఎం రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోఠి మహిళా కళాశాల చౌరస్తాలో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మిధాని డిపో మేనేజర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో జాతీయ గీతాలాపన కార్యక్రమం, తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు ఆయన సిటీ రీజియన్ డిప్యూటీ ఆర్ఎం శ్యామల, సుల్తాన్బజార్ ఎస్సై మధుసూదన్, డీఎం ఆంజనేయులుతో కలిసి గీతా వందనం చేసి తిరంగా ర్యాలీ ప్రారం భించారు. ర్యాలీలో డిపో సూపర్వైజర్లు, కంట్రోలర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ర్యాలీ చౌరస్తా నుంచి ఆంధ్రాబ్యాంకు చౌరస్తా మీదుగా కోఠి బస్స్టాప్ వరకు సాగింది. రూ. 125 టీవైఎల్ టికెట్ ఈ నెల 9 నుంచి 21 వరకు రూ.75కు, స్వాతంత్య్ర దినోత్సవం రోజున అన్ని బస్సుల్లో వృద్ధులు, ఆగస్టు 15న పుట్టిన వారికి 12 ఏండ్లలోపు వరకు ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు. ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు సిటీ రీజియన్ పరిధిలోని 17 డిపోల్లో ఈ నెల 21 వరకు ప్రతి రోజు ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపన నిర్వహిస్తున్నామన్నారు.